రాజకీయాలలోకి నూతనంగా అడుగుపెట్టిన వారైనా దశాబ్దాల అనుభవం ఉన్నవారైనా ఒక్క తప్పు తెలిసి చేసినా ఆవేశంలో హద్దు దాటినా, ఆలోచన కోల్పోయినా దాని మూల్యం భారీగానే ఉంటుందనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.
అరవ శ్రీధర్ కు వీణ అనే ఒక మహిళకు మధ్య ఉన్న అక్రమ సంబంధం మొత్తం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఆయన రాజకీయ జీవితం అయోమయంలో పడిపోయింది. వీణ చేస్తున్న ఒక్కో ప్రకటన, ఆమె సోషల్ మీడియా వేదికగా వదులుతున్న ఒక్కో వీడియో అటు శ్రీధర్ తో పాటుగా జనసేన పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది.
ఈ వ్యవహారం పై పూర్తి విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని అప్పటి వరకు శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అధికారిక ప్రకటన విడుదలయ్యింది. అయితే పార్టీ తరుపున పవన్ వేసిన విచారణ కమిటీ మీద కూడా వీణ అనేక ఆరోపణలు చేస్తున్నారు.
బాధితురాలైన తనకు న్యాయం చేయకుండా జనసేన తన పార్టీ ఎమ్మెల్యే తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిలో ఉన్న పవన్ రాష్ట్రంలో ఉన్న ఒక మహిళకు తన పార్టీ నేత వల్లే అన్యాయం జరిగితే ఇప్పటివరకు స్పందించలేదని,
కమిటీల పేరుతో ఇలా కాలయాపన చేయడం ఎంతవరకు న్యాయం అంటూ వీణ సోషల్ మీడియాలో జనసేనతో పాటుగా పవన్ పైన కూడా అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. అలాగే తాజాగా జరిగిన కొన్ని జనసేన పార్టీ కార్యక్రమాలకు అరవ శ్రీధర్ పార్టీ కండువాలతో పాల్గొన్నారు.
దీనితో వీణ మరోసారి జనసేన టార్గెట్ గా పవన్ పై బెదిరింపు అస్త్రాలు ప్రయోగించారు. ఒక మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వివాదంలో ఉండి విచారణను ఎదుర్కొటున్న శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం అత్యంత సిగ్గుచేటు అని,
ఇంత జరిగిన తరువాత కూడా పవన్ తనకు న్యాయం చెయ్యకపోతే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ అల్టిమేటం జారీచేశారు వీణ. దీనితో అరవ శ్రీధర్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకోబోతుందా అన్న చర్చ మొదలయ్యింది.
మరి పవన్ ఈ వివాదానికి ఎలా ముగింపు పలకబోతున్నారు.? తన పార్టీ ఎమ్మెల్యే పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు.? వీణ ఆరోపణలకు ఎటువంటి జవాబు చెప్పబోతున్నారు.? ఒక్కడు చేసిన తప్పుకి పార్టీ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే రాజకీయంలో ఒక్క పొరపాటు కూడా భారీ మూల్యాన్ని కోరుకుంటుంది అంటుంటారేమో..!






