అధికారంలో ఉన్నవారు గత ప్రభుత్వ హయంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని చెప్పి, కేసులు నమోదు చేసినప్పుడు అది నిరూపించి, అవినీతికి పాల్పడినవారికి శిక్షలు పడేలా చేయడం, వారి వలన ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి జరిగిన నష్టం తిరిగి రాబట్టినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఎక్కడా ఈవిదంగా జరుగడం లేదు. చాలా అరుదుగా దోషులకు శిక్షలు పడుతుంటాయి. పడినా తాము నిర్దోషులమని, రాజకీయ బాధితులమని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందగలుగుతున్నారు.
దాదాపు 15 ఏళ్ళుగా అక్రమాస్తుల కేసులు, గత ఆరేళ్ళుగా వివేకా హత్య కేసు విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నేటికీ ఆ రెండు కేసుల విచారణలు పూర్తవనే లేదు.
ఆక్రమాస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డి(ఏ-1), విజయసాయి రెడ్డి(ఏ-2) 16 నెలలు జైల్లో గడిపి బెయిల్పై బయటకు వచ్చి తాము నిర్దోషులమని, రాజకీయ బాధితులమని చెప్పుకున్నారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి కూడా అలాగే చెప్పుకున్నారు. ప్రజలు వారి వాదనలతో ఏకీభవించారు కనుకనే వారు పదవులు పొంది ఆ స్థాయికి ఎదగగలిగారు!
అవినీతిపరులపై కేసులు నమోదు చేసినా వ్యవస్థలు ఏమీ చేయలేని నిసహాయ స్థితిలో ఉన్నందున, ఆ కేసులు అధికార పార్టీలకు రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నాయి. అందువల్లే అవినీతికి పాల్పడినవారు చాలా ధైర్యంగా అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజలను నమ్మించగలుగుతున్నారు. అధికారంలోకి రాగలుగుతున్నారు.
అంటే అవినీతి జరిగిందని ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థలకు, మీడియాకు, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ దోషులకు శిక్షలు విధించలేకపోవడం వలననే, అవినీతిపరుల చేతికే రాజ్యాధికారం లభిస్తోందని, ఆ ధైర్యంతోనే వారు మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది.
కనుక ఇప్పుడు ఎంత పెద్ద అవినీతి కేసులో చిక్కుకున్నా రాజకీయ నాయకులు ఎవరూ ఇప్పుడు భయపడటం లేదు. పైగా జైలుకి వెళ్ళడం వలన ప్రజల సానుభూతి కూడా పొందవచ్చని గ్రహించారు. కనుక అరెస్ట్ చేసుకోమని సవాళ్ళు విసురుతున్నారు. కనుక ఇప్పుడు ఈ కేసులు, విచారణాలు అన్నీ రాజకీయ కాలక్షేపంగా మిగిలిపోతున్నాయి.
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ని సిట్ అధికారులు నిన్న విచారణ జరిపారు.
ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా చేసిన ఆయనని విచారణ చేశారు కనుక తర్వాత జగన్కి నోటీస్ ఇస్తారని అప్పుడే కొందరు సంతోషపడుతున్నారు.
కానీ ఇస్తే, వస్తే ఏమవుతుంది?అని ఆలోచిస్తే అది మీడియాకి మరో సంచలన వార్తగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప మరేమీ కాదు.. అని పాత కేసులు చెపుతున్నాయి కదా!




