వందే భారత్‌ ప్రారంభోత్సవాలు ఇంకెంత కాలం?

Vande Bharat Launches

ప్రధాని మోడీ ఈరోజు బెంగళూరులో బెంగళూరు-బెళగావి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచే అమృత్ సర్-కాట్ర, నాగ్‌పూర్-పూణే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళని వర్చువల్‌గా ప్రారంభించారు.

అలాగే బెంగళూరులో ఆర్‌వీ రోడ్-బొమ్మ సంద్ర మద్య మెట్రో ఎల్లో లైనర్‌కి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు సిఎం సిద్ద రామయ్య, డెప్యూటీ సిఎం డీకే శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ADVERTISEMENT

భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్‌ రైళ్ళు నిసందేహంగా ఓ గొప్ప సరికొత్త అధ్యయమే. అత్యాధునిక సదుపాయాలతో తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరేందుకు ఇవి చాలా అనువుగా ఉండటంతో వందే భారత్‌ రైళ్ళకు మంచి ప్రజాధరణ లభిస్తోంది. స్లీపర్ కోచ్‌లతో వందే భారత్‌ రైళ్ళు కూడా వచ్చేశాయి. కనుక మరింత సుఖంగా ప్రయాణాలు చేయవచ్చు.

భారతీయ రైల్వేలో వందే భారత్‌ రైళ్ళని ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ, రైల్వేశాఖ ఆలోచన చాలా అభినందనీయం. కానీ ఇవి ప్రవేశపెట్టిన రెండు మూడేళ్ళ తర్వాత కూడా దేశంలో ఎప్పుడు, ఎక్కడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళని ప్రారంభించాలన్నా ప్రధాని మోడీయే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది.

భారత్‌ వంటి సువిశాలమైన దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి వందే భారత్‌ రైళ్ళ ప్రారంభోత్సవాలు… వాటి క్రెడిట్ అవసరమా? అనిపిస్తుంది.

వీటికంటే కశ్మీర్‌ని దేశంలో మిగిలిన రాష్ట్రాలతో కలుపుతూ నిర్మించిన ప్రపంచంలో కెల్లా ఎత్తయిన రైల్వే వంతెన ప్రారంభోత్సవం, ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న భారీ సొరంగ మార్గాలు, అయోధ్య రామమందిర నిర్మాణం, ఆపరేషన్ సింధూర్ వంటివన్నీ ప్రధాని మోడీ గొప్పదనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కదా?

కనుక ఆయన స్థాయికి వందే భారత్‌ రైళ్ళ ప్రారంభోత్సవాలు తగినవవి కావనిపిస్తుంది. లేదా ఇటువంటి ప్రారంభోత్సవాలకు మించి చాలా ఎత్తులో ప్రధాని మోడీ స్థాయి ఉందని చెప్పుకోవచ్చు.

ఇందుకు ఓ చిన్న తాజా ఉదాహరణగా కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన విమర్శలే. మెట్రో ఎల్లో లైనర్‌ నిర్మాణానికి ఏ మాత్రం సహకరించని ప్రధాని మోడీ, దాని ప్రారంభోత్సవం చేసి క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు. కనుక మెట్రో లేదా వందే భారత్‌ రైళ్ళ ప్రారంభోత్సవాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ లేదా ఆయా రాష్ట్రాలలో కేంద్ర మంత్రులకు, లేదా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విడిచిపెట్టేస్తే బాగుంటుంది. లేకుంటే ఇటువంటి విమర్శలు భరించక తప్పదు. ప్రధాని మోడీ స్థాయి నాయకుడికి ఇటువంటి క్రెడిట్లు, విమర్శలు అవసరమా?

ADVERTISEMENT
Latest Stories