గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరినీ ఎంతగా వేధించారో అందరూ చూశారు.
చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, నారా లోకేష్, ధూళిపాళ నరేంద్ర, పట్టాభి, జేసీ బ్రదర్స్… ఇలా ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని వారి ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తూ, వారిని దొంగలు, అవినీతిపరులు, రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులనే ముద్రలు వేసేందుకు రకరకాల కేసులు పెట్టించి, వాటితో వేధించి, వారిని ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టేందుకు జగన్ ప్రభుత్వం చేయని అకృత్యం లేదు.
శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యి పాపం పండి శ్రీకృష్ణుడు చేతిలో హతం అయిన్నట్లు, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించడంతో జగన్ వంద తప్పులు పూర్తయ్యి పాపం పండి ఆయన చేతిలోనే తుడిచిపెట్టుకుపోయారు.
జగన్ తమని వేధిస్తున్నప్పుడే ఈ పద్దతులు మంచివి కావని, అటువంటి దురాలోచనలు మానుకొని పాలనపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, అమరావతి, పోలవరం పూర్తి చేయమని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టిడిపి నేతలు, పవన్ కళ్యాణ్ పదేపదే జగన్మోహన్ రెడ్డికి హితవు చెప్పేవారు.
వారి హితోక్తులు జగన్కు చాతకానితనంగా వినిపించాయే తప్ప చెవిక్కించుకోలేదు. కనీసం జగన్ శ్రేయోభిలాషులు, డజన్ల కొద్దీ నియమించుకున్న సలహాదారులు, ఐప్యాక్ ఎవరైనా ఆయనకు చెప్పి ఉండవచ్చు. కానీ ఎవరూ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయకపోవడంతో అందరూ కలిసే మునిగారు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం తప్పదు.
కనుక టిడిపి ప్రభుత్వం ముందుగా మాజీ వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై కేసు నమోదు చేయించి జైలుకి పంపించింది. అయితే అది ఆయన స్వయంకృతమే తప్ప టిడిపి ప్రత్యేకంగా కక్ష కట్టి చేసింది కాదని అందరికీ తెలుసు. అనాడూ పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రంలో జొరబడి దౌర్జన్యం చేసి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జైలుకి వెళ్ళక తప్పలేదు.
అయితే ఇది ఆరంభం మాత్రమే అని వైసీపిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కనుక ఎవరి పాపాలకు వారు పద్దులు వ్రాసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్దంగా ఉండక తప్పదు.




