డీలిమిటేషన్ తో ‘డీల్’ కుదిరిందా కేటీఆర్.?

Arvind Dharmapuri on KTR & Revanth Participation in Delimitation

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న డెలిమిటేషన్ విధానం తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది అనే ఉద్దేశంతో చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ‘ఫెయిర్ డిలిమిటేషన్’ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు.

అయితే ఇందుకు గాను తెలంగాణ నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యి, స్టాలిన్ నినాదానికి తమ మద్దతు తెలియచేసారు. అయితే రాష్ట్రంలో ఉప్పు..నిప్పు మాదిరి తలపడే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పొరుగు రాష్ట్రంలో మాత్రం ఒకే స్వరం వినిపించడం వెనుక దాగిఉన్న ఆ తెరచాటు రహస్యమేమిటి అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ మీడియా ముందుకొచ్చారు.

ADVERTISEMENT

తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో డిలిమిటేషన్ విధానాన్ని ఒక బూచిగా చూపించి తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి డీఎంకే వేసిన వ్యూహంలో తెలంగాణ కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు చిక్కుకున్నారని, సొంత రాష్ట్రంలో పిల్లి, ఎలక మాదిరి కొట్టుకునే ఈ రెండు పార్టీలు, ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రం వెళ్లి మరి ఒకే విధానం పై గళమెత్తారంటూ ఆరోపిస్తున్నారు అరవింద్.

అసలు కాంగ్రెస్ కూటమి మద్దతు ఇచ్చే ఈ సమావేశాలతో బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు పనేమిటి.? అంటే కాంగ్రెస్ కూటమి లో బిఆర్ఎస్ కూడా ఒక భాగం కానుందా.? అంటూ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు బీజేపీ నేతలు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు బీజేపీ ని ఎదగనివ్వకుండానే ఉద్దేశంతోనే ఇక్కడ కొట్లాడుకున్నట్టు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బిఆర్ఎస్ వ్యవహారం గమనిస్తే హైద్రాబాద్ లో కుస్తీ…చెన్నై లో దోస్తీ అన్న చందంగా మారిందంటూ ఎద్దేవా చేసారు. అయితే చెన్నై లో జరిగిన ఈ డిలిమిటేషన్ వ్యతిరేక సమావేశంలో కాంగ్రెస్ అధికార పార్టీ నేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కూడా బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారు.

ఈ డెలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం తప్పదని, ఈ విధానం వల్ల అధికారం పూర్తిగా ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుందంటూ వెల్లడించారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పొతే సమైక్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందంటూ తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేసారు కేటీఆర్.

అలాగే దేశంలో డీలిమిటేషన్ అమలైతే దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించే అవకాశం తగ్గుతుందని, దాని ఫలితంగా ఇక్కడి వారిని ద్వితీయ శ్రేణి పౌరుల చూసే ప్రమాదం లేకపోలేదంటూ రేవంత్ కూడా తన పార్టీ స్టాండ్ ను బహిర్గతం చేసారు. అయితే ఈ రెండు పార్టీల నాయకులు కూడా బీజేపీ విధానానికి వ్యతిరేకంగా స్వరం కలపడంతో తెలంగాణ బీజేపీ నేతలు డీలిమిటేషన్ తో కాంగ్రెస్…బిఆర్ఎస్ పార్టీల మధ్య డీల్ కుదిరిందా అంటూ కేటీఆర్ కు కౌంటర్ వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories