మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇంతవరకు స్పందించని ముగ్గురు ప్రముఖులున్నారు. వారే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సిఎం కేసీఆర్.
ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించి ఇక్కడ శాసనసభ, లోక్సభ సీట్లు గెలుచుకోవాలనుకొంటున్న కేసీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించలేదు! సమర్ధించలేదు. తద్వారా మౌనం వహిస్తూ ఎటుకావాలంటే అటు మాట్లాడేందుకు ‘ఆప్షన్స్’ ఓపెన్గా ఉంచుకొన్నారన్న మాట.
కానీ కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుని ఎంతగా ద్వేషిస్తారో అందరికీ తెలుసు. కనుక ఆయన మౌనం చంద్రబాబు నాయుడు అరెస్టుని, ఆ నిర్ణయం తీసుకొన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని సమర్ధిస్తున్నట్లే భావించవచ్చు.
కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ ఆయన అత్యంత సన్నిహితుడు, బిఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన మనసులో మాటను బయటపెట్టారు.
ఏపీలోని మజ్లీస్ పార్టీ మద్దతుదారులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పాపం చంద్రుడు జైల్లో ఉన్నాడు. ఆయన ఎందుకు జైల్లో ఉన్నాడో అందరికీ తెలుసు. ఏపీలో ప్రజలకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చంద్రబాబు రెండోది జగన్. ఇద్దరిలో జగన్ బలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కంటే ఆయనే మేలు ఎందుకంటే చంద్రబాబు నాయుడుని నమ్మలేము. ఏపీలో మన పార్టీని బలపర్చాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది. ఎందుకంటే ప్రతీచోటకి నేనే వచ్చి పార్టీని బలోపేతం చేయలేను కదా. కనుక ఏపీలో మీ వంతు కృషి మీరు చేయాల్సి ఉంటుంది,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఇప్పుడు ఇదే వ్యాఖ్యలను ఓవైసీ పేరుకు బదులు కేసీఆర్ అని పెట్టుకొని చదివితే, అది కూడా నూటికి నూరు శాతం మ్యాచ్ అవుతుంది! అంటే కేసీఆర్ మనసులో మాటనే ఓవైసీ బయటపెట్టారన్న మాట!
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎప్పటిలాగే తెర వెనుక నుంచి కేసీఆర్ మద్దతు, సహాయసహకారాలు అందిస్తారని ఓవైసీ చెపుతున్నట్లే భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా ఉందంటూ తెలంగాణ మంత్రులు తరచూ చెపుతుండటం ఏపీలో ప్రజలందరూ వింటూనే ఉన్నారు. అయినా మళ్ళీ జగనే అధికారంలోకి రావాలని కేసీఆర్ కోరుకొంటున్నారంటే అర్దం ఏమిటి?
కేసీఆర్ జగన్కు మద్దతు ఇస్తున్నప్పుడు లేదా ఇవ్వాలనుకొంటునప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎందుకు ఖండిస్తారు? పైగా తెలంగాణలో లక్షల ఆంద్రా ఓటర్లున్నారు. కనుక మౌనమే మంచి ఆప్షన్.
అయితే తను చేయలేకపోయిన పనిని జగన్ చేశారని, తన చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు నాయుడుపై ప్రతీకారం తీర్చుకోగలిగినందుకు కేసీఆర్ కూడా సంతోషిస్తుండవచ్చు. ఇటువంటి వారందరూ కేవలం చంద్రబాబు నాయుడుపై పగ బట్టిన్నట్లుకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పగబట్టిన్నట్లనిపిస్తోంది.



