విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి మంత్రి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నియోజకవర్గానికి ఆయన సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్స భార్య బొత్స ఝాన్సీ రెండుసార్లు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్గా చేసినందున గత ఎన్నికలలో ఆమె విజయనగరం నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకొన్నారు. కానీ అది సాధ్యపడలేదు.
కనుక ఈసారి ఆమెను నెల్లిమర్ల నుంచి శాసనసభకు పోటీ చేయించాలని బొత్స సత్యనారాయణ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు టికెట్ గురించి జగన్ చెవిలో వేసిన్నట్లు తెలుస్తోంది. అంటే నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సీటుకి బొత్స ఎసరు పెట్టడానికి సిద్దం అవుతున్నారనుకోవచ్చు.
బడ్డుకొండ అప్పలనాయుడు నియోజకవర్గంలో చాలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ క్యాడర్, ప్రజల నుంచి కూడా తమకు పిర్యాదులు వస్తున్నాయనే కారణంతో ఆయనను పక్కకు తప్పించేందుకు మంత్రి బొత్స ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగలోని వైసీపీ సీనియర్ నేతలు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, బర్రి చిన్నప్ప తదితరులు కూడా ఎమ్మెల్యే బడ్డుకొండ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అక్రమక్వారీ తవ్వకాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో ఎమ్మెల్యే బడ్డుకొండ నిర్వాసితుల పేర్లను మార్చేసిన్నట్లు కూడా పిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కూడా ఒక్కో లేఅవుట్… ఒక్కో వెంచర్కి ఇంత మొత్తం అని నిర్ణయించి వారి నుంచి బలవంతంగా కమీషన్లు వసూలు చేస్తున్నట్లు కూడా పిర్యాదులు వస్తున్నట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో సిఎం జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న సర్వేలలో కూడా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకి నెగెటివ్ మార్కులు పడిన్నట్లు తెలుస్తోంది. కనుక ఇవన్నీ చూపి బడ్డుకొండను తప్పించి ఈసారి తన భార్య బొత్స ఝాన్సీకి నెల్లిమర్ల టికెట్ ఇవ్వాలని మంత్రి బొత్స అధినేతని కోరుతున్నట్లు సమాచారం.
బడ్డుకొండ అప్పలనాయుడుకి నియోజకవర్గంలో పార్టీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఈసారి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవచ్చని బొత్స సత్యనారాయణ పట్టుదలగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నిజానికి బడ్డుకొండ అప్పలనాయుడుని బొత్స సత్యనారాయణే రాజకీయాలలోకి తీసుకువచ్చి, టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఆయనే బడ్డుకొండని పక్కకు తప్పించేసి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తుండటం విశేషం. ఇంకా టికెట్ రేసులో బొత్స సోదరుడు బొత్స లక్ష్మణ్ రావు కూడా ఉన్నారు. కానీ వదినగారి కోసం వెనక్కు తగ్గిన్నట్లు తెలుస్తోంది.



