నారా రోహిత్ హీరోగా నటించిన “సావిత్రి” సినిమా ఆడియో విడుదల వేడుకపై నందమూరి నటసింహం చేసిన సరదా వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎప్పుడు ఏ విషయంలో దొరుకుతారా అని ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకు బాలయ్య వ్యాఖ్యలు ఓ అవకాశం కల్పించినట్లయ్యింది. దీంతో బాలయ్య వ్యాఖ్యలు సరికావంటూ మండిపడడం కృష్ణాజిల్లా వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వంతయ్యింది.
ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు మహిళలంటే గౌరవం లేదని, ఉంటే ఇంత చులకన భావంతో మాట్లాడరని, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న బాలయ్య మహిళలను ఉద్దేశించి … ‘వెళ్లి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి’ అంటూ వ్యాఖ్యానిస్తారా? మహిళలపై ఏ మాత్రం గౌరవం లేదనడానికి ఇంత కంటే నిదర్శనం అవసరం లేదని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కల్పన విమర్శలు గుప్పించారు.
అయితే ఇదే వేదికపై బాలయ్య మహిళలను ఉద్దేశిస్తూ తన ‘లెజెండ్’ సినిమాలో చెప్పిన డైలాగ్స్ సదరు ఉప్పులేటి కల్పన గారూ చూడలేదా అంటూ బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. సినీ ఈవెంట్లలో సరదాగా వ్యాఖ్యలు చేయడం సాధారణమే అని, అందులో భాగంగా చేసిన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులమడం వైసీపీ నేతల తీరుకు అద్దం పడుతుందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.



