చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర ఆందోళన చెందుతున్న టిడిపి శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకు రావడం చాలా మంచి నిర్ణయమే. ఈరోజు మంగళగిరి టిడిపి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు, ఇటీవల గుండెపోటుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నట్లు ప్రకటించారు.
టిడిపి కష్టకాలంలో నందమూరి వారసుడు బాలకృష్ణ పార్టీని, క్యాడర్ను కాపాడుకొనేందుకు ప్రజల మద్యకు రావాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. సింహంలా గర్జించే బాలకృష్ణ కనిపిస్తే టిడిపి శ్రేణులలో మళ్ళీ నూతనోత్సాహం వస్తుంది. ఆయన సినీ అభిమానులు కూడా టిడిపికి తోడవుతారు.
అయితే సినిమాలలో ఎలాంటి కటినమైన, ఎంత పెద్ద డైలాగులైనా అవలీలగా చెప్పగలిగే బాలయ్య సభలు, మీడియా సమావేశాలలో మాట్లాడేటప్పుడు తడబడుతుంటారనే విషయం తెలిసిందే. బాలయ్యకు రాజకీయాలు కొట్టిన పిండే కానీ వాటి గురించి ఆయన అందరినీ మెప్పించేలా మాట్లాడలేకపోవడం బలహీనత అని చెప్పక తప్పదు.
ముఖ్యంగా బాలయ్య ప్రజల మద్యకు వచ్చినప్పుడు సహనం కోల్పోయి అభిమానులపై కూడా చేయి చేసుకొన్న సందర్భాలున్నాయి.
ఆయనను అప్రదిష్ట పాలుచేసేందుకు వైసీపికి ఈ రెండూ చాలు. కనుక బాలయ్య ప్రతిష్టకు భంగం కలగనీయకుండా ఆయన సేవలను ఏవిదంగా వాడుకోవాలో టిడిపియే సరైన ప్రణాళిక సిద్దం చేసుకోవలసి ఉంటుంది.



