అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!

Balineni Srinivasa Reddy

ఇంతకాలం వైసీపీ నేతల భాగోతాల గురించి టీడీపీ, జనసేన, మీడియా బయట పెడుతుండేవి. కానీ ఇప్పుడు వైసీపీ భాగోతాలను షర్మిల, తల్లి విజయమ్మ, విజయసాయి రెడ్డి తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి బయటపెట్టారు.

పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో బాలినేని మాట్లాడుతూ, జగన్‌ తన ఆస్తులను కూడా దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ కాజేసిన ఆ ఆస్తుల జాబితా త్వరలోనే బయటపెడతానని చెప్పారు.

ADVERTISEMENT

ఆస్తుల విషయంలో తల్లినీ, చెల్లినీ కూడా జగన్‌ కోర్టుకు ఈడ్చారు. కనుక బాలినేని చేసిన ఈ ఆరోపనలలో ఎంతో కొంత నిజముండే ఉంటుంది. కానీ ఈ ఆరోపణలను నిరూపించి చూపాల్సిన బాధ్యత బాలినేనిదే. అప్పుడే ప్రజలకు ఆయన మాటలపై నమ్మకం కలుగుతుంది.

జగన్మోహన్ రెడ్డిపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్దగా స్పందించని వైసీపీ, బాలినేని వ్యాఖ్యలపై వెంటనే ఘాటుగా బదులివ్వడం విశేషం.

బాలినేని వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు చేసిన భాగోతాలని బయటపెడుతోంది. తద్వారా వైసీపీ నేతల హిస్టరీ ఎంత గొప్పగా ఉందో వారంతట వారే బయటపెట్టుకొని ప్రజలను చైతన్యపరుస్తునందుకు చాలా సంతోషించాల్సిందే.

ఈరోజు సాక్షి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో “బాలినేని.. జగన్‌ గురించి మాట్లాడే స్థాయేనా నీది?” అనే హెడ్డింగ్‌తో వైసీపీలో ఉన్నప్పుడు బాలినేని అవినీతి, అక్రమాల భాగోతాలన్నీ బయటపెట్టింది.

వాటి గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. బాలినేనికి తండ్రి ఇచ్చిన ఆస్తి పెద్దగా లేదు. జగన్‌ దయతలిచి మంత్రి పదవి ఇస్తే దానిని అడ్డుపెట్టుకొని బాలినేని వేలకోట్ల ఆస్తులు పోగేసుకున్నారు.

స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యాలో క్యాసినోలో ఆడేందుకు వెళ్ళి వచ్చారు. ఒంగోలులో బ్రాహ్మణుల భూములతో సహా అనేక భూములు కాజేశారు.

బాలినేని అవినీతి, దోపిడీ, భూకబ్జాలు ప్రకాశం జిల్లాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. వైసీపీలో టీడీపీ కోవర్టుగా పనిచేస్తూ బాలినేని వైసీపీని దెబ్బ తీశారు.

అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని వంటివారు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వేలకోట్లు పోగేసుకున్నారని, విచ్చలవిడిగా భూకబ్జాలు చేసేవారని వైసీపీ ధృవీకరించిందన్న మాట! అంటే బాలినేని వంటి నేతల అవినీతి, అక్రమాలను ఇంతకాలం వైసీపీ దాచిపెట్టిందన్న మాట!

అలాగే బాలినేని కూడా తమవంటి అవినీతి నేతల నుంచి జగన్‌ కూడా పిండుకునేవారని నిన్న సభలో బయటపెట్టారు కదా?

బాలినేని భాగోతాలే ఇన్ని ఉంటే మరి వైసీపీలో విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి చాలా మంది ఉన్నారు కదా? వారందరూ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా మడికట్టుకు కూర్చున్నారని వైసీపీ చెప్పగలదా?

బాలినేనికి ఇంత ఘన చరిత్ర ఉందని వైసీపీ సర్టిఫై చేస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్‌ ఆయనని ఇంకా పార్టీలో కొనసాగనిస్తే జనసేనలో కూడా అవినీతిపరులకు, భూకబ్జాలకు పాల్పడినవారికి స్థానం, ప్రాధాన్యత ఉంటుందనే తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లే కదా?

ADVERTISEMENT
Latest Stories