ఓ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించడానికి లేదా ఎన్నికలలో విజయం సాధించడానికి వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయి. అయితే కొన్నిసార్లు పొత్తులే కాదు కత్తులు కూడా విజయానికి దోహదపడతాయి! కానీ ఆ కత్తులే గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇందుకు నిదర్శనంగా 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకు, ఏపీ సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు ఏపీ పోలీసులను, జలవనరుల శాఖా అధికారులను పంపించి డ్యామ్ గేట్లు తెరిపించారు.
సరిగ్గా పోలింగ్ ముందు రోజున నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏపీ, తెలంగాణ పోలీసులు, అధికారుల మద్య యుద్ధం జరిగితే ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిలి బీఆర్ఎస్ పార్టీకి లబ్ది కలిగించి కేసీఆర్ ఋణం తీర్చుకోవాలని జగన్ తాపత్రయపడ్డారు. కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభంజనంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోయింది. అది వేరే విషయం.
కానీ ప్రతీసారి పొత్తులే కాదు యుద్ధాలతో కూడా లబ్ది పొందవచ్చని ఇది స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేటికీ ఈ విధానాన్నే నమ్ముకుంది. విజయవంతంగా అమలుచేస్తోంది కూడా.
బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభ్యంతరాలపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తన అభిప్రాయం చెప్పగా, వెంటనే హరీష్ రావు దానిని పట్టుకొని అల్లుకుపోయి, చిలవలు పలవలుగా చేసేసి, ‘చంద్రబాబు నాయుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి కన్నం పెట్టి నీళ్ళు పట్టుకుపోవాలని అనుకుంటున్నారు మేము చూస్తూ ఊరుకోము,’ అంటూ నారా లోకేష్ మాటలను బీఆర్ఎస్ పార్టీ కోసం వాడేసుకున్నారు.
ఈ నేపధ్యంలో… ఇటీవల కేటీఆర్ హైదరాబాద్లో మంత్రి నారా లోకేష్ని రహస్యంగా కలిశారనే సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటిపై కేటీఆర్ స్పందన గుర్తు వస్తాయి.
అప్పుడు కేటీఆర్ నేను నారా లోకేష్ని కలవలేదంటూనే “నా తమ్ముడు వంటి లోకేష్ని కలిస్తే తప్పేమిటి?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ తనని కలిశారో లేదో, ఓ అన్నగా ఆయన ఏం కోరారో నారా లోకేష్ ఇంతవరకు చెప్పనే లేదు. కానీ ఈ తాజా యుద్ధం నేపధ్యంలో చూసినట్లయితే, బహుశః ‘బీజేపిలో బీఆర్ఎస్ పార్టీ విలీనమూ వద్దు… అందుకు టీడీపి మద్దతూ వద్దు… కేవలం మాపై కత్తులు దూస్తుంటే చాలని’ కేటీఆర్ వరం అడిగారేమో?
బహుశః ‘అన్న’కి నో చెప్పలేక నారా లోకేష్ బనకచర్ల గురించి మూడు ముక్కలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి ‘మాట సాయం’ చేశారేమో? అని సందేహం కలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ, చంద్రబాబు నాయుడుని తెలంగాణ నుంచి తరిమికొట్టామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ & కో నేటికీ చంద్రబాబు నాయుడు భజన చేస్తుండటం, ఆయన పేరుతోనే తమకు మళ్ళీ పూర్వ వైభవం లభిస్తుందని ఆశ పడుతుండటం విచిత్రంగానే ఉంది కదా?ఒకవేళ చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేయకపోతే పాపం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమయ్యేదో?






