శ్రీలంకకు షాక్… ఫైనల్లో బంగ్లాదేశ్..!

 bangladesh victory over sri lankaశ్రీలంక – బంగ్లాదేశ్ ల నడుమ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ లాంటి మ్యాచ్ లో… ఒక బంతి మిగిలి ఉండగా బంగ్లాదేశ్ జయకేతనం ఎగురవేసి టీమిండియాతో ఫైనల్ కు సిద్ధమైంది. దీంతో ఆతిధ్యం ఇస్తోన్న శ్రీలంక జట్టు టోర్నీ నుండి వైదొలగడం విశేషం. 70 ఏళ్ళ శ్రీలంక స్వాతంత్ర్యం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ టోర్నీలో రెండు సార్లు బంగ్లాదేశ్ చేతిలో భంగపాటుకు గురికావడం ఊహించని విషయం.

ADVERTISEMENT

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, తొలి 6 ఓవర్లలోనే 4 టాపార్డర్ వికెట్లు పడగొట్టి డిఫెన్స్ లో నెట్టింది. ఆ తర్వాత వికెట్ కూడా కోల్పోయిన తర్వాత శ్రీలంకను కుషాల్ పెరేరా (61), తిషారా పెరేరా (58)లు ఆదుకున్నారు. వీరిద్దరి బ్యాటింగ్ తీరుతో 159 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను సాధించగలిగింది. మునుపటి మ్యాచ్ లో 214 పరుగులను బంగ్లా చేజ్ చేయడంతో, ఈ మ్యాచ్ లో అవలీలగా గెలుస్తుందని భావించారు.

అంచనాలకు తగిన విధంగానే తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి లక్ష్య చేధనలో రైట్ ట్రాక్ లో ఉంది. విజయానికి చేరువవుతున్న తరుణంలో ఒత్తిడికి గురైన బంగ్లా బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు చేరుకోవడంతో, విజయానికి చివరి 5 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా, షకీబ్ లు ఉండడంతో మ్యాచ్ బంగ్లా వైపుకే టర్న్ అవుతుందని భావించారు.

కానీ అనూహ్యంగా శ్రీలంక ఆధిపత్యం చలయిస్తూ షకీబ్ ను పెవిలియన్ పంపి, బంగ్లాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్ వచ్చే సరికి 12 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగు కూడా రాకపోగా, మరో వికెట్ రనౌట్ రూపంలో కోల్పోయింది. ఇక్కడ జరిగిన 10 నిముషాల డ్రామా అనంతరం ప్రారంభమైన మ్యాచ్ లో వరుస బంతుల్లో 4,2,6 పరుగులు సాధించి బంగ్లాను ఫైనల్లో నిలబెట్టాడు మహ్మదుల్లా.

ADVERTISEMENT
Latest Stories