మన భారత రత్నాలు చౌదరీ చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాధన్‌

Chaudhary Charan Singh MS Swaminathan

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డును నేడు ప్రకటించింది. మన పీవీతో పాటు దివంగత ప్రధాని, ప్రముఖ రైతు ఉద్యమకారుడు చౌదరీ చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్‌లకు కూడా కేంద్ర ప్రభుత్వం నేడు భారతరత్న అవార్డు ప్రకటించింది.

చౌదరీ చరణ్ సింగ్

ADVERTISEMENT

చౌదరీ చరణ్ సింగ్ మహాత్మా గాంధీజీతో కలిసి స్వాతంత్రోద్యమాలలో పాల్గొన్నారు. 1930 నుంచి 12 ఏళ్ళపాటు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదల కాగానే బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ అరెస్ట్ చేసింది. 1940లో మళ్ళీ 1942లో రెండుసార్లు జైలు జీవితం గడిపారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా చేపట్టిన భూసంస్కరణలు యూపీని అభివృద్ధిపధంలోకి నడిపించాయి. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షాలతో చేతులు కలిపి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు కానీ కేవలం 9 నెలలే ఆ పదవిలో ఉండగలిగారు.

తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చౌదరీ చరణ్ సింగ్ హోమ్ మంత్రిగా, ఆర్ధికమంత్రిగా చేశారు. ఆ తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లను తట్టుకుని అధిగమిస్తూ 1979, జూలై 28వ తేదీన దేశ ప్రధాని కాగలిగారు. జనవరి 1980 వరకు దేశ 5వ ప్రధానిగా సేవలందించారు. 1987, మే 29న కన్ను మూశారు.

ఎంఎస్ స్వామినాధన్

దివంగత ప్రధాని పీవీ దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెకించి ఆర్ధికాభివృద్ధికి బాటలు పరిస్తే, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్‌ దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి కాపాడారు.

ఒకానొక దశలో దేశ జనాభా అదుపు తప్పి ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితి నెలకొంది. అప్పుడే స్వామినాధన్ సరికొత్త ఆలోచనలు, కృషి, దూరదృష్టితో దేశంలో వ్యవసాయ రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

స్వామి నాధన్ మార్గదర్శనంలో భారత్‌ ‘గ్రీన్ రివల్యూషన్’ సాధించింది. భారతీయుల ప్రధాన ఆహారమైన బియ్యం, గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగేందుకు ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఆయన మార్గదర్శనమే దేశాన్ని కాపాడి ఆహార భద్రత కల్పించింది.

దేశ వ్యవసాయ రంగంలో పెను మార్పులు సాధించి దేశాన్ని ఆహార సంక్షోభం బారిన పడకుండా కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వం ఆయనను అనేక అవార్డులతో సన్మానించింది.

1967: పద్మశ్రీ అవార్డు, 1971: రామన్ మెగసెసే అవార్డు, 1972: పద్మ భూషణ్, 1989: పద్మ విభూషణ్, 2024: భారత్‌ రత్న.

ఎంఎస్ స్వామినాధన్ 1925, ఆగస్ట్ 7వ తేదీన మద్రాస్ రెసిడెన్సీ (ఇప్పుడు తమిళనాడు) కుంభకోణంలో జన్మించారు. 2023, సెప్టెంబర్‌ 28వ తేదీన తుది శ్వాస విడిచారు.

ADVERTISEMENT
Latest Stories