ఎట్టకేలకు పీవీకి భారతరత్న… శభాష్! మరి ఎన్టీఆర్‌కి ఎప్పుడో?

PV Narasimha Rao

దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకి కేంద్ర ప్రభుత్వం నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రకటించింది. ఇన్నేళ్ళ తర్వాత మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డకు అత్యున్నతమైన ఈ అవార్డు లభించడం తెలుగువారందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు చాలా గర్వకారణమే.

పీవీ నరసింహరావు పాత కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందినవారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1957లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1962,67,72 ఎన్నికలలో విజయం సాధించారు.

ADVERTISEMENT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆయన తొమ్మిది సంవత్సరాలపాటు వివిద శాఖలకు మంత్రిగా చేశారు. 1971లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగారు. కానీ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, గొడవలు భరించలేక పదవిలో నుంచి తప్పుకున్నారు. 1977 లోక్‌సభ ఎన్నికలలో హనుమకొండ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి జాతీయ రాజకీయాలలోనే కొనసాగారు.

రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల తర్వాత 1991లో పీవీ ప్రధాని అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టారు. ఆ సమయంలో దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉంది. ఆర్ధికమంత్రి డా. మన్మోహన్ సింగ్‌తో కలిసి దేశాన్ని మళ్ళీ గాడిన పెట్టారు. ఏ క్షణంలో కూలిపోతుందో తెలీని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు విజయవంతంగా నడిపించారు.

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషలు, వాటి సాహిత్యంపై మంచి పట్టుంది. మంచి రచయిత. దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా కాపాడిన ఆ మహోన్నత వ్యక్తి అయిన పీవీ 2004, డిసెంబర్‌ 3న చనిపోయినప్పుడు, కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయనకు సగౌరవంగా వీడ్కోలు పలుకలేకపోవడం దేశ ప్రజలందరూ చాలా బాధపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆయనను సముచిత గౌరవం ఈయనప్పటికీ, మోడీ ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారంతో ఆయనను గౌరవించింది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పీవీకి ఈ అవార్డు ప్రకటించిన్నట్లు అర్దమవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ కారణంతో పీవీకి ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ప్రకటించినప్పటికీ దీంతో దక్షిణాది ప్రజలు, తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషిస్తారు.

పీవీకి అవార్డు ప్రకటించగానే తెలుగు ప్రజలందరి మనసుల్లో మరి ఎన్టీఆర్‌కి ఎప్పుడు? అనే ఆలోచన తప్పక కలుగుతుంది. సినీ, సాహిత్య, కళా, రాజకీయ, సామాజిక రంగాలలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు కూడా తప్పకుండా భారత రత్న అవార్డు ఇవ్వాల్సిందే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కూడా. కనుక కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు కూడా భారత రత్న అవార్డు ప్రకటించి గౌరవిస్తుందని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories