అదేదో సినిమాలో “ఎగిరిపోతే ఎంత బాగుంటుందో…’ అనే పాట ఉంది. అలాగే ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతల తీర్పులకే విలువుంటే ఎంత బాగుంటుందో…. అని అనిపిస్తుంది.
అధికారంలో ఉన్నప్పుడు చేయకూడని తప్పులు చేసిన వైసీపీ నేతలపై ఇప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తుంటే లోపలకి వెళుతున్నవారు, బయట ఉన్నవారు తాము చంద్రబాబు నాయుడి రాజకీయ కక్ష బాదితులమని చెప్పుకుంటున్నారు.
వారి వాదనల ప్రకారమే ఆలోచిస్తే “అయితే చంద్రబాబు నాయుడు వారిపై ఎందుకు కక్ష కట్టారు?అనే ప్రశ్నించాల్సి వస్తుంది. దీనికి సమాధానం అందరికీ తెలుసు.
కనుక తమ హయంలో చంద్రబాబు నాయుడుతో సహా టీడీపి ముఖ్యనేతలను వేధించి, అరెస్టులు చేసి, జైళ్ళలో పెట్టించినప్పుడు తప్పు అనుకోలేదు. అప్పుడు జగన్తో సహా వైసీపీ నేతలెవరికీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తురాలేదు. కానీ ఇప్పుడు తమని అరెస్ట్ చేసి జైలుకి పంపుతుంటే “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసు ఓ అభూతకల్పన అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మళ్ళీ వారే “ఈ కేసుతో సంబంధం లేనివారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని” వాదిస్తున్నారు. అంటే అవినీతికి పాల్పడటం, అందుకు కేసులు నమోదవడం వాస్తవమే అనే అభిప్రాయం వారి మాటల్లోనే వినపడుతోంది కదా?
కానీ తామందరం ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చాలా నిజాయితీగా పనిచేశామని వైసీపీ నేతలు తమకు తామే క్లీన్ సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటున్నారు. కనుక వారిచ్చుకుంటున్న ‘కాండక్ట్ సర్టిఫికెట్స్’, తీర్పులతో ఈ కేసుల నుంచి బయటపడే వెసులుబాటు ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా?అనిపిస్తుంది.
కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అంటే వారు అవినీతి, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని నమ్ముతుండబట్టే కదా? ముఖ్యంగా ఈ కేసులో అరెస్టుకి సిద్దంగా ఉన్నానని వారి అధినేత జగన్ చెప్పారంటే అర్ధం ఏమిటి?
మిథున్ రెడ్డి అరెస్టుపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ, “వైసీపీ నేతలను అక్రమ కేసులలో ఇరికించి అరెస్టులు చేసి జైల్లో పెడితే నష్టపోయేది కూటమి ప్రభుత్వమే తప్ప వైసీపీ కాదు. అధికారంలో ఉన్నామని తలకాయలు నరికేస్తాము…. మా అందరినీ జైళ్ళలో పెడతామంటే కుదరదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ప్రజలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు గ్రహిస్తే మంచిది. ఇప్పుడు మమ్మల్ని ఎంతగా వేదిస్తే ఇంతకు ఇంతా భవిష్యత్తులో అనుభవించక తప్పదని సిఎం చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి,” అని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
కానీ ఆయన మాటల్లోనే గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పులు చేసి దాని పర్యవసానాలు అనుభవిస్తోందనే అభిప్రాయం లీలగా కనబడుతూనే ఉంది. భూమన మాటల్లోనే ‘తలకాయలు నరికేయడం’ అనే మాట కూడా వినపడింది.
అంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నా వైసీపీ ధోరణి ఏమాత్రం మారలేదని స్పష్టమవుతోంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే సిఎం చంద్రబాబు నాయుడు, పోలీస్ అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగానే బెదిరిస్తున్నప్పుడు ప్రజలు తమని ఎందుకు గెలిపించాలి?ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటి? అని వైసీపీ నేతలు ఆలోచిస్తే వారికే ‘కర్తవ్యం’ బోధ పడుతుంది.




