బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి (243 సీట్లకి 202)ఘన విజయం సాధించింది. ఎన్డీయేలో జేడీయూ (85) కంటే బీజేపి (89)కి కాస్త ఎక్కువ సీట్లే వచ్చాయి. కనుక ఈసారి ముఖ్యమంత్రి బీజేపి తీసుకుంటుందని చాలా మంది భావించారు.
కానీ ఈసారి కూడా నితీష్ కుమారే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నేడు పాట్నాలో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది పదోసారి. కనుక ఇదో సరికొత్త రికార్డ్.
నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నందున బీజేపికి 10 మంత్రి పదవులు లభించగా జేడీయుకి 6, కూటమిలో ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం, ఎల్జేఎస్ పార్టీలకు చెరో మంత్రి పదవీ లభించాయి.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కోరుకుంటే బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపికే లభించి ఉండేది. కానీ వారు బీహార్ ముఖ్యమంత్రి పదవి కంటే కేంద్రం బలంగా ఉండటం, అందుకు నితీష్ కుమార్ మద్దతు చాలా అవసరమని చాలా ముఖ్యమని భావిస్తున్నందున ముఖ్యమంత్రి పదవిని ఆయనకే విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ అందుకు బదులుగా 10 మంత్రి పదవులు బీజేపికి తీసుకున్నారు. కనుక ఇది మంచి నిర్ణయమే అని భావించవచ్చు.






