నాగార్జునకి పదేళ్ళు స్టే ఎలా లభించింది? రఘునందన్ సూటి ప్రశ్న

BJP MP Raghunandan Rao

నాగార్జున ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేత వ్యవహారం ఈరోజు మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెపుతూనే, మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి మద్యంతర స్టే తెచ్చుకున్నారు.

దీనిపై న్యాయవాది కూడా అయిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చాలా ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వానికి, హైకోర్టుకి, నాగార్జునకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.

ADVERTISEMENT

“ఎవరైనా చెరువులని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని వెంటనే కూలగొట్టేయమని సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ చెప్పాయి. అయినప్పటికీ నాగార్జున 2014లో హైకోర్టుని ఆశ్రయిస్తే స్టే ఇచ్చింది. భూవివాదంపై స్టే ఇవ్వడం తప్పు కాదు. కానీ ఓ భూవివాదంపై స్టే ఎన్ని రోజులు ఇస్తారు? ఓ నెల రోజులు… రెండు, మూడు లేదా ఆరు నెలలు లేదా ఏడాది అనుకుందాం.

కానీ 2014 నుంచి 2024 వరకు పది సంవత్సరాల పాటు మళ్ళీ ఈ కేసు హైకోర్టు బెంచికి ఎందుకు రాలేదు? రాకుండా ఏ శక్తులు అడ్డుపడ్డాయి? అసలు పదేళ్ళపాటు స్టే ఎందుకు కొనసాగింది?అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. హైకోర్టు పిలిస్తే దీనిపై నా వాదనలు వినిపించేందుకు సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.

నాగార్జునని ఉద్దేశ్యించి, “ఇది ఆక్రమణ కాదని అంటున్నారు. మరైతే జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు మీ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేయాలని ఎందుకు అనుకుంటున్నారు?వారు కూల్చివేయాలనుకున్నప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఓకే. కానీ పదేళ్ళుగా అది హైకోర్టు బెంచ్ ముందుకు రాకుండా ఎలా మేనేజ్ చేశారు?

మీకు కేసీఆర్‌ దోస్త్ కావచ్చు. మీ మాజీ కోడలు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. అందువల్లే ప్రభుత్వం కూడా మీ కన్వెన్షన్ సెంటర్‌ జోలికి రాలేదని అందరికీ తెలుసు.

ఇన్నేళ్ళు ఈవిదంగా వ్యవస్థలని మేనేజ్ చేస్తూ ఇప్పుడు, ముందే చెపితే నా అంతటా నేనే కూల్పించేసే వాడినని చెపుతుండటం, నీతి, న్యాయం, ధర్మం అంటూ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

మీరు అక్రమంగా నిర్మించిన మీ కన్వెన్షన్ సెంటర్‌లో నెలకు రెండుమూడు ఫంక్షన్స్ చేసుకొంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కనుక గత ప్రభుత్వానికి భారీగానే విరాళాలు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆనాడు హైదరాబాద్‌కి వరదలు వచ్చి బాలిక కొట్టుకుపోతే కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా… ఎందుకు ఇవ్వలేదు?మీరు చెరువు కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్‌ నిర్మించడం వలననే కదా అటువంటి విషాద ఘటనలు జరుగుతున్నాయి. బాధ్యత గల, చట్టాన్ని గౌరవించే పౌరుడు అంటే ఇదేనా?” అని రఘునందన్ రావు సూటిగా నాగార్జునని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా రఘునందన్ రావు తప్పు పట్టారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో చెరువులలో కబ్జాలని తొలగించమని చెపుతుంటే ఇలాంటి అక్రమ కట్టడాలను చూసి చూడన్నట్లు ఎందుకు ఊరుకున్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT
Latest Stories