కాన్ఫిడెన్స్ కు – ఓవర్ కాన్ఫిడెన్స్ కు మధ్య ఓ సున్నితమైన ‘గీత’ ఉంటుంది. ప్రస్తుతం ఆ ‘గీత’నే భారతీయ జనతా పార్టీ మరిచినట్లుగా కనపడుతోంది. కాంగ్రెస్ పోటీనిచ్చే దశలో లేదు కనుక, తదుపరి ఎన్నికలలో కూడా కేంద్రంలో తామే విజేతలం, కాబట్టి తమ చుట్టే ప్రాంతీయ పార్టీలన్నీ తిరుగుతాయి అన్న నమ్మకంలో బిజెపి పెద్దలు ఉన్నట్లుగా కనపడుతోంది. బహుశా కేసులతో సతమతం అవుతోన్న వైసీపీ వంటి పార్టీలు బిజెపి ఉచ్చులో చిక్కుకోవడం సహజమే గానీ, ఆత్మగౌరవం నినాదంతో ప్రారంభమైన టిడిపి కూడా ఈ దిశగా అడుగులు వేయదని ప్రజలు భావిస్తున్నారు.
ఎందుకంటే… రోజురోజుకు బిజెపి నేతల మాటలు పెచ్చుమీరుతున్నాయి. కేవలం టిడిపినే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాలను కించపరిచే విధంగా మాట్లాడుతుండడం అత్యంత హేయమైన చర్య. రెండు సార్లు ప్రధాని ఎంపికలో కీలక పాత్ర పోషించాను, జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేశాను, తన లాంటి వ్యక్తిపై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు చేస్తోన్న వ్యాఖ్యలు అదుపులో ఉంచుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేసారంటే… బిజెపి నేతల ఆలోచనలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగతం చేసుకోవచ్చు. అంతేనా… రైల్వే జోన్ విషయంలో కేంద్ర పెద్దలు చేసిన కామెంట్స్ అయితే మరింత ఎటకారంగా ఉన్నాయి.
రైల్వే జోన్ ఇస్తే ఏమొస్తుందయ్యా… ఓ ఇద్దరు ప్రభుత్వ అధికారులు పెరగడం తప్ప… అంటూ పలికిన పలుకులు వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. నిజంగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే పెరిగితే, కేంద్రానికి వచ్చే నష్టం ఏముంది? మోడీ ఒక్క సంతకంతో ఎప్పుడో రాష్ట్రానికి రైల్వే జోన్ వచ్చి ఉండేది కదా! చేయాల్సిన పనులకేమో ఇలాంటి ఎటకారపు మాటలతో గారడీ చేయడం బిజెపి నేతలకు పరిపాటిగా మారింది. మరి ఈ మాటలు మన రాష్ట్ర నేతలైన చంద్రబాబు, జగన్, పవన్ లకు వినిపించడం లేదా? గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణా నేతలు అన్నపుడు పడ్డ ఏపీ జనాలకు ఇలాంటి సహజమే అని ఊరుకున్నారా?



