ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపితో సహా విపక్షాలన్నీ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తన అన్న నిర్ణయాన్ని తప్పు పడుతుండటమే విశేషం. ఇదే విషయం టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ప్రస్తావిస్తూ చెల్లెలుకున్నపాటి ఇంగిత జ్ఞానం అన్నకు లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన తన అనుచరులతో కలిసి విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ఎన్టీఆర్ వైద్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకొన్నాము. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందంటూనే, యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి తన తండ్రి పేరు పెట్టుకొన్నాడు. ఆయనకు అంతగా తండ్రి పేరు పెట్టుకోవాలంటే కొత్తగా మరో యూనివర్సిటీ లేదా మెడికల్ కాలేజీ కట్టించి దానికి పెట్టుకోవచ్చు కదా?కోట్లాది తెలుగు ప్రజలు అభిమానించే ఎన్టీఆర్ పేరు మార్చడం దేనికి?
యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి జగన్ వికృతానందం అనుభవిస్తున్నాడు. అది చూసి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అన్నను అసహ్యించుకొంటోంది. కనీసం చెల్లెలు వైఎస్ షర్మిలకు ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా సిఎం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. అతనికి ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే కొనసాగించాలని టిడిపి, రాష్ట్ర ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నిర్ణయం ఉపసంహరించుకోనే అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము,” అని బోండా ఉమా అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన తండ్రి పేరును, ఆయన అకాల మరణంపట్ల ప్రజలలో ఏర్పడిన సానుభూతిని వాడుకొని ఆ పునాదులపైనే వైసీపీని బలంగా నిర్మించుకొన్నారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొన్ని నెలలు తండ్రి పేరు తలచుకొన్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా తగ్గించేశారు. (ఇప్పుడు ఎక్కువగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లనే తలుచుకొంటున్నారు.) ఆ తర్వాత చెల్లెలు వైఎస్ షర్మిల అన్నకు దూరంగా తెలంగాణకు వెళ్లిపోయింది. ప్లీనరీ సమావేశంలో తల్లి విజయమ్మ చేత రాజీనామా చేయించి చెల్లెలు వద్దకు పంపించేశారు. ఈవిదంగా తల్లితండ్రులను, చెల్లెలిని మరిచిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తండ్రిపై ప్రేమ, గౌరవంతోనే యూనివర్సిటీ పేరు మార్చారా?అంటే కాదనే అర్దమవుతుంది. టిడిపి, చంద్రబాబు నాయుడు ఆక్రోశించేలా చేసి ఆనందించాలనే ఆలోచన మాత్రమే కనబడుతోంది. అందుకే వైఎస్ షర్మిల సైతం అన్న తీరును తప్పు పడుతున్నారు.



