ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అందినకాడికి ఇసుక, మట్టి తవ్వేసుకొని అమ్ముకొంటున్నారు. చివరికి కొండలు గుట్టలను కూడా వదలకుండా తవ్వేసుకొంటున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కొండలు, గుట్టలు తవ్వేస్తుంటే ఒకటొకటిగా మాయం అయిపోతున్నాయి.
మద్యం వ్యాపారం కూడా వైసీపీ నేతల చేతుల్లోనే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక వారి భూకబ్జాలు సరేసరి. టిడిపి హయాంలో ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడి అమరావతిలో విలువైన భూములు కొట్టేశారని ఆరోపిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలే గత నాలుగేళ్ళుగా విశాఖని రాజధాని పేరు చెప్పి చుట్టుపక్కల ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి వారి భూములు కూడా గుంజుకొంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
ఇవన్నీ కళ్ళకు కనబడుతున్న, చెవులకు వినబడుతున్న అవినీతి, అక్రమాలు కాగా, వైసీపీ నేతలు మరో రకంగా కూడా దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారని నేడు ‘ఈనాడు’ మీడియాలో ‘బొత్స కుటుంబానికి బొనాంజా’ శీర్షికతో ప్రచురితమైన కధనం బయటపెట్టింది.
వైసీపీ చేతిలోనే పదవీ, అధికారం ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలకు వారు కోరుకొన్న భూములు, నీరు, విద్యుత్, అనుమతులు అన్నీ మంజూరు చేసేసుకొంటున్నారని ఈ కధనం తెలియజేస్తోంది.
మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి విజయనగరంలో ఇప్పటికే చాలా భూములు, క్వారీలు, బినామీ పేర్లతో మద్యం వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కేబిల్ టీవీ వగైరాలు ఉన్నాయి.
తాజాగా ఆయన ఇద్దరు సోదరులు సతీష్ కుమార్, ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న సత్యా బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 30 ఎకరాల భూమిని కారుచవుకగా కట్టబెట్టేస్తూ ప్రభుత్వం జూలై 21న గుట్టుగా జీవో జారీ చేసింది.
ఏపీఐసీసీ రేటు ప్రకారం అక్కడ ఎకరం రూ.82 లక్షలు ఉండగా, బయట మార్కెట్లో ఎకరం సుమారు కొట్టిన్నర నుంచి రెండు కోట్లుపైనే పలుకుతోంది. అంత విలువైన భూమిని బొత్స సోదరులకు ఎకరం కేవలం 10 లక్షల చొప్పున ధారాధత్తం చేసేసింది.
సత్యా బయో ఫ్యూయల్స్ కంపెనీలో ఓ డిస్టీలరీ, ఓ ఇధైల్ ఎసిటెట్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. కనుక ప్రభుత్వ నిబందనల ప్రకారమే తమకి ఆ భూమి కేటాయించిన్నట్లు వారు చెప్పుకొంటున్నారు.
కారుచవుకగా ప్రభుత్వ భూమిని కేటాయింపజేసుకోవడమే కాదు… ఈ ప్లాంటుకి అవసరమైన నీటిని కూడా కారుచవుకగా కేటాయింపజేసుకొన్నారు మంత్రి బొత్స.
రాష్ట్రంలో 20 లీటర్ల నీళ్ళ బాటిల్ ధర రూ.30-35 వరకు ఉండగా, ఈ ప్లాంటుకి 10,000 లీటర్లు నీళ్ళు కేవలం రూ.5 చొప్పున రోజుకి 2 లక్షల లీటర్ల నీటిని సమీపంలో గల వేగవతి నది నుంచి కేటాయిస్తూ జలవనరుల శాఖ మరో జీవో జారీ చేసిందని ఈనాడు కధనంలో పేర్కొంది.
అంటే వైసీపీ నేతలు కొండలు, గుట్టలు, నదులు తవ్వేస్తూ అక్రమంగా దోచుకోవడమే కాకుండా ఈవిదంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడా దోచుకొంటున్నారని అర్దమవుతోంది.



