“మనకు బలం లేనప్పుడు శాసనసభలో మన గొంతు వినిపించదు. కనుక శాసనసభ సమావేశాలకు వెళ్ళి ప్రయోజనం లేదని జగన్ స్వయంగా ఇదివరకు చెప్పారు. కనుక తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప శాసనసభ సమావేశాలకు రానని చెప్పి తప్పించుకుంటున్నారు.
ఈ కారణంగా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నప్పుడు, మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలను ఎందుకు పంపుతున్నట్లు?అనే సందేహం కలుగుతుంది.
మాజీ మంత్రిగా, రాజకీయాలలో సీనియర్ నేత అయిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఇటు పాలనపరమైన అంశాలపై చాలా అవగాహన, రాజకీయలలో చాలా అనుభవం ఉంది. కనుక ఆయన మండలిలో జరుగుతున్న చర్చలలో ఒంటరిగానే కూటమి సభ్యులను చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. కనుక శాసనసభలో బలం లేదు కనుక మాకు మాట్లాడే అవకాశం ఉండదనే జగన్ వాదన వితండమని స్పష్టమవుతోంది. శాసనమండలిలో బొత్స సత్యనారాయణని అందరూ గౌరవంగా చూస్తున్నారే తప్ప అవమానించడం లేదు.
జగన్ తాను సింహం వంటివాడినని, అర్జునుడి వంటివాడినని గర్వంగా చెప్పుకుంటారు. తనకు (40 శాతం) ప్రజల ఆశీర్వాదాలు, పైనుంచి దేవుడి ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటారు.
కనుక జగన్ ఇప్పటికైనా ధైర్యం చేసి శాసనసభ సమావేశాలకు హాజరై తాడేపల్లి ప్యాలస్ ప్రెస్మీట్లో చెపుతున్న మాటలు, చేస్తున్న విమర్శలు చేసి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేయవచ్చు కదా?లేకుంటే మండలికి ఎమ్మెల్సీలను పంపిస్తున్న పులిచింతల ఎమ్మెల్యే జగన్ శాసనసభకు వచ్చేందుకు భయపడి మొహం చాటేస్తున్నారని జనం అనుకోకుండా ఉంటారా?




