ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే లైన్ తీసుకుని రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు, జగన్తో సహా వైసీపి నేతలందరూ రోడ్లపై ప్రజల మద్యనే ఉండాలి. కానీ జగన్ ప్యాలస్లో కూర్చొని ట్వీట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తుండగా, రోజా వంటి మరికొందరు విదేశాలలో చిల్ అవుతున్నారు.
యధారాజా తధాప్రజా అన్నట్లు పార్టీలో సీనియర్ నేతలు కూడా బయటకు రావడం మానేశారు. ఇంకా కాస్త ఓపిక ఉన్నవారు ట్విట్టర్లో దర్శనం ఇస్తున్నారు.
అయితే రెండు నెలల తర్వాత కూడా వైసీపి ఇంకా ఓటమి నుంచి తేరుకోలేకనే ఎవరూ బయటకు రావడం లేదని అనుకోవడానికి లేదు.
వారందరికీ గత 5 ఏళ్ళలో తాము చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు బాగా గుర్తున్నాయి. బయటకు వస్తే ప్రజలు నిలదీయకపోయినా టిడిపి శ్రేణులు ఎక్కడికక్కడ నిలదీస్తాయని, అవమానాలు, ఛీత్కారాలు, కేసులు మొదలవుతాయని బాగా తెలుసు. అందుకే జగన్తో సహా వైసీపీలో అందరూ ప్రజల మద్యకు రావడానికి జంకుతున్నారనుకోవచ్చు.
కానీ రెండు నెలల తర్వాత ఎవరూ బయటకు రాకపోతే పార్టీకి మరింత నష్టం జరిగితే మళ్ళీ కోలుకోవడం కష్టం అవుతుంది. ఇంతకాలం విశాఖ రాజధాని అంటూ హడావుడి చేసిన ఉత్తరాంధ్రా జిల్లాలలో ఈ నిశబ్ధం, ధర్మాన సోదరుల రాజకీయ సన్యాసాలు పార్టీని బలహీనపరుస్తాయి.
కనుక కాస్త న్యూట్రల్ ఇమేజ్ ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి విశాఖ ఎమ్మెల్సీ టికెట్ నైవేద్యంగా సమర్పించి రంగంలో దించారు జగన్.
నైవేద్యం ముట్టడంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మంగళవారం అనకాపల్లి జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సమావేశమై, స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో టిడిపికి బలం లేకునా పోటీకి దిగుతోందని, చంద్రబాబు నాయుడు డబ్బు వెదజల్లి అందరినీ ప్రలోభపెట్టి ఈ సీటు గెలుచుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కనుక మనమందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని అంటే తనను గెలిపించుకోవాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి కూటమి ప్రభుత్వం రెండు నెలల పాలన చాలా దారుణంగా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రా జిల్లాలలో పార్టీ క్యాడర్ని కూడా యాక్టివ్ చేస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది. అంటే జగన్ పెట్టిన ఎమ్మెల్సీ టికెట్ నైవేద్యం పనిచేస్తోందన్న మాట!




