మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఉత్తరాంధ్రాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విజయసాయి రెడ్డి లేఖలో కూడా ఇలాంటి హింట్ ఇచ్చారు. దానికి కొనసాగింపు అన్నట్లు ఈసారి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా నా కుమార్తె అనూష పోటీ చేస్తుందని బొత్స ప్రకటించారు.
ఉత్తరాంద్రలో జనసేనానికి మంచి ఫాలోయింగ్ ఉంది కానీ బలమైన నేతలు లేరు. కనుక బొత్సను సకుటుంబ సమేతంగా జనసేనలోకి ఆహ్వానించి, పార్టీ పదవులు, బాధ్యతలు అన్నీ అప్పగించేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే బొత్స ఈ ప్రకటన చేశారని టాక్.
ప్రస్తుతం ఆ పదవిలో అయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస రావు అలియాస్ చిన్న శ్రీను ఉన్నారు. ఆయనకి కూడా జనసేన నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. కనుక బొత్సకు జనసేన ‘ఫ్యామిలీ ప్యాక్’ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చు.
బొత్స చేసిన ఈ ప్రకటనపై చిన్న శ్రీను ఇంకా స్పందించాల్సి ఉంది. ఆయన మౌనం అర్ధాంగీకారం అనుకుంటే, ఈ పార్టీ మార్పు ఊహాగానాలపై బొత్స సత్యనారాయణ స్పందించకపోవడం కూడా ఇదే సూచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ జనసేనలో చేరే అవకాశం ఉందని ఆ ఊహాగానాల సారాంశం.
మరో విషయం ఏమిటంటే, బొత్స స్థాయి నాయకుడు వైసీపీని వీడారంటే, వచ్చే ఎన్నికలలో వైసీపీ నావ మునగబోతోందనే సంకేతంగా భావించవచ్ల్సిచు. గతంలో కాంగ్రెస్ నావ మునుగుతున్నప్పుడు వైసీపీలోకి జంప్ చేసి మంత్రి పదవి, తన కుటుంబానికి ఇతర పదవులు సంపాదించుకున్నారు. ఇప్పుడూ అదే చేయబోతున్నారు. కనుక వైసీపీ మునక ఖాయం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దానికి ఇంకా సమయం ఉంది. బొత్స జనసేనలో చేరుతారా లేదా?అనేది తెలిస్తే చాలు. తర్వాత కొత్త ఎపిసోడ్స్ మొదలవుతాయి.





