జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు ఇటీవల రైతు సమస్యలపై ధర్నాలు చేశారు. దాని తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. జనవరి 3న ఫీజ్ రీఇంబర్స్మెంట్ అంశంపై ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.
ఈవిదంగా ప్రజా సమస్యలపై వరుస పోరాటాలతో కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి, సంక్రాంతి పండుగ తర్వాత జగన్ రంగంలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ కార్యాచరణపై తాము ఇచ్చిన సలహాలను జగన్ పట్టించుకోకుండా పార్టీ శ్రేణుల చేత ఆందోళనలు నిర్వహించడం వలన తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలే అయ్యింది. అప్పుడే ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెట్టడం మంచిది కాదని, దీని వలన కూటమి ప్రభుత్వమే తమని వేలెత్తి చూపించే అవకాశం కల్పించిన్నట్లవుతుందని తాము చెప్పినా జగన్ వినలేదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు
విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కూడా జగన్ తొందరపడి ముందే ఆందోళనలకు పిలుపు ఇవ్వడం వలన ప్రజల మద్దతు పొందే మంచి అవకాశాన్ని కోల్పోయామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
జనవరిలో పెరిగిన విద్యుత్ బిల్లులు చేతికి వచ్చిన తర్వాత, వాటిని చూసి ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి ఉంటే, ప్రజలు తమతో బాగా కనెక్ట్ అయ్యేవారని కానీ తమ ‘వైసీపీ కోయిల’ తొందర పడి ముందే కూసిందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఫీజ్ రీఇంబర్స్మెంట్ విషయంలో కూడా తొందరపాటు వద్దని వైసీపీ నేతల సూచన మేరకు జనవరి 3న చేయాలనుకున్న ఆందోళనలు జనవరి 29కి వాయిదా వేయడానికి జగన్ అంగీకరించారు.
“జనవరిలో విద్యార్ధులకు పరీక్షలు ఉన్నందున 29కి వాయిదా వేసుకున్నామని” మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ ఆలోగా ప్రభుత్వం ఫీజ్ రీఇంబర్స్మెంట్ సొమ్ము చెల్లిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అంటే ప్రభుత్వం ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ చెల్లించలేకపోతే అప్పుడు దాని కోసం వైసీపీ ఆందోళనలు చేసిననట్లయితే, విద్యార్ధులు, వారి తల్లితండ్రులు మనతో కనెక్ట్ అవుతారని తమ సమస్యల కోసం వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతోందని వారికీ నమ్మకం కలుగుతుందని వైసీపీ నేతలు జగన్కి నచ్చజెప్పుకున్నారని స్పష్టమవుతోంది.
సంక్రాంతి తర్వాత జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి రిలీజ్ అవుతానని చెప్పుకున్నారు కనుక జనవరి 29కి ముహూర్తం పెట్టుకుంటారేమో?




