గుజరాత్.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్! ఎందువల్ల అంటే అది ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గనుక. అలాంటి గుజరాత్ రాష్ట్రంలో ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు.
వంతెన కూలిపోవడం గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వ పరువు పోయింది. దాంతో పాటు మోడీ, అమిత్ షాల ప్రతిష్టకు భంగం కలిగింది.
జమ్ము కశ్మీ ర్లో ప్రపంచంలోకెల్ల ఎత్తైన రైల్వే వంతెనని, రామేశ్వరంలో సముద్రంపై వంతెనని ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. కానీ సొంత రాష్ట్రంలో 2022లో మోర్బీ వంతెన కూలిపోగా, ఇప్పుడు వడోదర జిల్లాలోని గంభీర్ నదిపై వంతెన కూలిపోయింది. కనుక అందరూ ప్రధాని మోడీనే వేలెత్తి చూపిస్తున్నారు కదా?
కానీ ఆ వంతెన ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు.. సుమారు 40 సంవత్సరాల క్రితం అంటే 1986లో నిర్మించబడింది. కాలక్రమంలో అది బలహీనపడి ప్రమాదకరంగా మారింది.
కనుక ఆ వంతెనని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతూ జిల్లా పంచాయత్ సభ్యుడు హర్షద్ సింగ్ సిన్హా పర్మార్ ఆర్&బీ అధికారులకు 2022, ఆగస్టులో లేఖ వ్రాశారు. కనీసం దానిపై ఎవరూ ప్రయాణించకుండా వంతెనని మూసివేయాలని మళ్ళీ 2022 అక్టోబరులో మరోసారి విజ్ఞప్తి చేశారు.
కానీ జిల్లా కలెక్టర్, అధికారులు పట్టించుకోకపోవడం వలన మొన్న ఆ వంతెన కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న ట్రక్కులు, ఇతర వాహనాలు నదిలో పడిపోయాయి. అంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది.
దేశంలో ఎన్నో అత్యద్భుతమైన వంతెనలు, సొరంగ మార్గాలు, జాతీయ రహదారులు నిర్మించి చూపుతున్న ప్రధాని మోడీ, తన సొంత రాష్ట్రంలో ఓ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వలన అందరి ముందు తలదించుకోవలసి వస్తోంది. విమర్శలు భరించాల్సి వస్తోంది కదా?




