ఇక్కడ ఏపీలో, అక్కడ తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి కూటమి ప్రభుత్వాలు గత ప్రభుత్వాల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వాలు విచారణ జరిపిస్తున్నాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పాత టెక్నాలజీతో నిర్మిస్తున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, ఇంకా ధరణీ పోర్టల్ తదితర అంశాలపై విచారణలు జరుగుతున్నాయి.
అదేవిదంగా ఆంధ్రాలో జగన్ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్, జగన్ బొమ్మలు, వైసీపి రంగులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. టిడిపి కార్యాలయంపై దాడులు, మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుని హింసించడంపై విచారణ సాగుతోంది. ఇంకా మరికొన్ని అంశాలపై విచారణ సాగుతోంది.
కానీ జగన్ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల విచారణ జరుగుతున్న తీరు, వాటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు దర్జాగా బయటపడుతున్న తీరు గమనించినప్పుడు ఈ కేసులతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏమైనా సాధించగలవా?అసలు ఏమి సాధించాలనుకుంటున్నాయి? అనే సందేహం కలుగక మానదు.
తమ రాజకీయ ప్రత్యర్ధులపై అవినీతి ఆరోపణలు చేసి కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామనే తృప్తిపడటానికి తప్ప ఏ ఒక్క కేసులోనైనా అవినీతికి పాల్పడినవారిని గుర్తించి శిక్షించిన దాఖలాలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పవచ్చు.
తెలంగాణలో కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు వేల ఎకరాలు భూకబ్జాలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించేవారు.
అదేవిదంగా జగన్ హయాంలో వైసీపి నేతలు అటు చిత్తూరు నెల్లూరు నుంచి ఇటు విశాఖ, శ్రీకాకుళం వరకు భారీగా భూములు కబ్జాలు చేశారని టిడిపి నేతలు ఆరోపించేవారు.
ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు కదా… మరి ఆ భూములు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? అని సామాన్యుల ప్రశ్న.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో వైసీపి నేతలు ఎక్కడెక్కడ అక్రమంగా కొండలు, గుట్టలు విచ్చలవిడిగా తవ్వేసుకుంటూ వాహనాలలో కంకర, మట్టి, ఇసుక తవ్వకాలు తరలించుకుపోతున్నారో ఫోటోలతో సహా చూపేవారు.
మరిప్పుడు వారందరిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఇంకా ఉపేక్షిస్తోంది? అని సామాన్య ప్రజల ప్రశ్నకు ప్రభుత్వమే జవాబు చెప్పాలి.
టిడిపి కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో రాష్ట్రంలో మదనపల్లి కలెక్టర్ కార్యాలయంతో సహా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. వాటిపై ప్రభుత్వం ఏం చర్య తీసుకుందో ఎవరికీ తెలీదు.
కనుక ఈ కేసులు, విచారణలు అన్నీ రాజకీయ కాలక్షేపానికేనా? అవినీతిపరులను శిక్షించలేనప్పుడు ఈ కేసులు, విచారణ పేరుతో ప్రజాధనం వృధా చేయడం ఎందుకు?




