‘విలీనం’తో మొదలై ‘విలీనం’తోనే ముగియనుందా?

brs-bjp

ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన పార్టీ తెరాస పార్టీ. ఆ పార్టీ లక్ష్య సాధనకు జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తెరాస పార్టీకి ప్రాణం వచ్చినట్లయ్యింది.

ADVERTISEMENT

అప్పటి వరకు తన పోరాటాన్ని ఒక స్థాయికి పరిమితం చేసిన కేసీఆర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక పరిధి దాటి ఉద్యమ కార్యాచరణకు తెరలేపారు. ఆమరణ నిరాహార దీక్ష అస్త్రంతో ముందుకెళ్లి తెరాస ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం అనే హామీతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర విభజన సాధించారు.

అయితే ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెరాస ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాం అన్న మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ప్రకటించినప్పటికీ కేసీఆర్ పార్టీ విలీనం పై మాట మార్చి కాంగ్రెస్ మీదే యుద్ధం ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ సాధించడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించడంతో తెలంగాణ ప్రజలు తెరాస పార్టీకి దశబ్ద కాలం పాటు అధికారాన్ని కట్టబెట్టారు.

ఈ విధంగా తెరాస ‘విలీనం’ ప్రకటన తరువత తన విజయపరంపర మొదలుపెట్టింది. అయితే వచ్చిన అధికారంతో, గెలుపు గర్వంతో విర్రవీగిన కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షమన్న మాటే వినపడకుండా అన్ని పార్టీల నేతలను తన కారెక్కించి ప్రతిపక్ష పార్టీల అస్తిత్వాన్ని దెబ్బ కొట్టారు. ఈ కోవలోనే టి. టీడీపీ తెలంగాణలో తన ఉనికిని కోల్పోయింది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో కనుమరుగు దిశగా అడుగులేసింది.

పదేళ్లు తెలంగాణలో ఏకచక్రాధిపత్యం వహించిన తెరాస తన పరిధిని పెంచుకోవడానికి బిఆర్ఎస్ గా రూపాంతరం చెంది సొంత రాష్ట్రంలోనే చతికిలపడింది. 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి ఆపార్టీ ఉనికినే ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఒక్క గెలుపుతో వచ్చిన విజయ గర్వం ఒక్క ఓటమితో నేలరాలిపోయింది. పార్టీ ఓటమి, కవిత అరెస్టు, కేటీఆర్, కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలతో బిఆర్ఎస్ తుఫాన్ దాటికి వణుకుతున్న చిగురుటాకు మాదిరి కంపిస్తుంది.

ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో బిఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ నినాదంతో పుట్టిన పార్టీ ఢిల్లీలో విలీనమవ్వబోతుంది అన్న వార్తలు బిఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలనే కాదు తెలంగాణ వాదులను సైతం విస్తురపరుస్తుంది.

కాంగ్రెస్ లో విలీనం అంటూ తన రాజకీయ విజయ ప్రస్థానం మొదలుపెట్టిన తెరాస ఇప్పుడు బీజేపీ తో విలీనం అంటూ తన రాజకీయ ఉనికిని కోల్పోబుతుందా.? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే బిఆర్ఎస్ విలీనం మీద బీజేపీ పెద్దలు ద్రుష్టి కేంద్రికరిస్తారంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

అందుకే తెలంగాణ బీజేపీలో నిశ్శబ్దం చోటు చేసుకుందని, కేసీఆర్ కుమార్తె కవిత తన బెయిలు పిటిషన్ వెనుకకు తీసుకున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మీడియాలో ప్రసారమైన ఈ వార్తల మీద బిఆర్ఎస్ అధిష్టానం కానీ బిఆర్ఎస్ నేతలు కానీ స్పందించకపోవడం ఒకరకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బీజేపీతో బిఆర్ఎస్ రణమా? శరణమా? అనేది కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.

ADVERTISEMENT
Latest Stories