తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అవసరం. అది మాత్రమే తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, రైతుల గురించి పనిచేస్తుంది. కాంగ్రెస్ దోచుకోవడం తప్ప మరేమీ చేయలేదని కేసీఆర్ నిర్ధారించి చెప్పేశారు.
ఎన్డీఏ ముసుగులో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణపై పెత్తనం చేయడానికి రాబోతున్నారని, కనుక తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పేశారు. తెలంగాణ సంపదపై అందరి కళ్ళు పడ్డాయని దానిని దోచుకుపోవడానికే ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ కనిపెట్టి చెప్పారు. కనుక బీజేపిని తద్వారా చంద్రబాబు నాయుడుని అడ్డుకోవడం చాలా చాలా అవసరమని కేసీఆర్ తేల్చి చెప్పేశారు.
“ప్రజలు నన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి, కాంగ్రెస్ చేతికి కత్తి ఇచ్చి ఇప్పుడు నన్ను యుద్ధం చేయమంటే ఎలా చేయగలను?” అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఆయన “చేయాల్సిన అవసరం నాకేమిటి?” అని అడుగుతున్నట్లనిపిస్తుంది.
కేసీఆర్ శనివారం తన ఫామ్హౌస్లో బిఆర్ఎస్ నేతలతో సమావేశమైనప్పుడు, పనిలోపనిగా తన ఈ అభిప్రాయాలని, మనసులో ఆలోచనలను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చేరవేశారు.
కేవలం తనకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం, ప్రజల పట్ల నిబద్దత ఉందని, కనుక తాను మాత్రమే కాపాడగలనని చెప్పుకుంటున్న కేసీఆర్, తనను, తన పార్టీని ‘తెలంగాణ సెంటిమెంట్’ మాత్రమే కాపాడగలదని భావిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. అందుకోసం చంద్రబాబు నాయుడుని ‘బూచి’గా చూపించేందుకు కేసీఆర్ వెనకాడటం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వద్దనడానికి ఓ కారణం, బీజేపిని వద్దనడానికి మరో కారణం చెపుతున్నారు. ఉద్యమనేతగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని కోరుకోవడం, అందుకు ఇటువంటి రకరకల సాకులు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలను శాశించాలని మనసులో కోరిక ఉంటే తప్పు కాదు. కానీ ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించడం తప్పు కాదనుకున్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో మరే పార్టీ ఉండకూడదని కోరుకోవడం రాచరిక, దొర లక్షణాలే కదా?
ఇటువంటి రాచరిక పోకడలు మన ప్రజాస్వామ్యంలో గడ్డిపోచలా కొట్టుకుపోతుందని కేసీఆర్ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అయినా తన ఈ అప్రజాస్వామిక ఆలోచనలను చాలా తెలివిగా సమర్ధించుకుంటున్నారని అర్దమవుతూనే ఉంది.
అంటే ఎన్నికలలో ఓడిపోయినా కేసీఆర్ ధోరణి ఏ మాత్రం మారలేదనడానికి ఈ మాటలే నిదర్శనం. కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న కేసీఆర్ పట్లే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కేసీఆర్ మాట్లాడిన ఈ మాటలే ఆయన బుర్రలో ఎటువంటి ఆలోచనలున్నాయో వెల్లడిస్తున్నాయి. కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.




