అధినేత మిస్సింగ్…!

BRS_KCR

వరుస అపజయాల తరువాత దక్కే ఒక్క విజయం తాలూకా గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. అలాగే ఒక అఖండ విజయం తరువాత హత్తుకునే పరాజయం ఏ స్థాయికి దిగజారుస్తుందో వైసీపీ అధినేత వైస్ జగన్, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చూస్తే తెలిసొస్తుంది.

ADVERTISEMENT

అధికారం ఉన్నన్ని రోజులు పాలన మీద కన్నా ప్రతిపక్షాలు మీదనే వీరిద్దరి ద్రుష్టి పడింది. ఒక రకంగా జగన్ తో పోలిస్తే కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి పరుగులెత్తించారనే చెప్పాలి. కేసీఆర్ తన హయాంలో హైద్రాబాద్ ను మరో స్థాయికి చేర్చారు. అలాగే వ్యవసాయానికి అవసరమైన నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రైతులకు సకాలంలో నీటిని అందించారు.

అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి తో పాటు ప్రతిపక్షం మీద కూడా ఎప్పుడు ఒక కన్నేసి ఉంచేవారు కేసీఆర్. అయితే ఇంత చేసిన కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అయితే బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ స్వయంకృతాపరాదం కూడా లేకపోలేదు. అధికారం కట్టబెట్టిన ప్రజల కంటికే కనిపించకుండా, ప్రజలను తన దగ్గరికి చేరనివ్వకుండా కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరి పాలన కొనసాగించారు.

దీనితో కేసీఆరే స్వయంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించినట్టయింది. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనుకుంటూ రేవంత్ కేసీఆర్ ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వచ్చేసాడు. పదేళ్ల అధికారం, పదవి, హోదా అన్ని రెప్పపాటులో ఆవిరయ్యే సరికి రాజకీయాలకు దూరమయ్యారా అన్నంతలా కేసీఆర్ రాజకీయ వేదికల మీద కనుమరుగయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పితగా పిలవబడే కేసీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి కారు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళింది మళ్ళీ వెంటనే తిరిగొస్తుంది అంటూ కేటీఆర్ ప్రకటనలు చేసిన బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక్కో నాయకుడు కారు దిగి హస్తం గూటికో, కమలం చాటుకో వెళ్లిపోతున్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ బోణి కూడా కొట్టలేకపోయింది.

ఇక తెలంగాణలో బిఆర్ఎస్ కథ ముగిసింది అంటూ అటు అధికార పార్టీ నేతలు, అటు సమయం కోసం వేచి చూస్తున్న బీజేపీ నాయకులు ఎంతలా బిఆర్ఎస్ పార్టీని కించపరుస్తున్నా కేసీఆర్ మౌన ముద్ర వీడడం లేదు. త్వరలో బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్న కేసీఆర్ చలించడం లేదు.

కూతురు కవిత అరెస్టు జరిగి నెలలు గడుస్తున్నా కేసీఆర్ అడుగు ముందుకు వేయడం లేదు. పార్టీ నుండి సీనియర్ లీడర్లు కారు దిగుతున్నా కేసీఆర్ ఆపలేక పోతున్నారు. నాయకులు జారిపోవడంతో పార్టీ క్యాడర్ కూడా తలోదారి వెతుకుంటున్నారు. పార్టీకి అవసరమైన ఇటువంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ ప్రజలలోకి వచ్చి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తే పోగుట్టుకున్న బలాన్ని రాబట్టు కోగలుగుతారు.

ఓటమినే తలచుకుంటూ ముందడుగు వేయకపోతే పార్టీకి భవిష్యత్తు ఉంటుందా.? ఎన్నో ఏళ్ళ పోరాటాలతో బలపడ్డ పార్టీ కేసీఆర్ మౌనం తో కూలిపోవడానికి సిద్దమవుతుంది. నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తానూ పెంచి పోషించిన నాయకుల చేతనే ఎన్నో అవమానాలను, ఛీత్కారాలకు ఎదుర్కొన్నారు. చివరికి తన భార్యను కూడా రాజకీయ వేదికల మీదకు తీసుకు వచ్చి సమాజం తలదించుకునే విధంగా అవమానించారు.

ఆ అవమానంతో బాధపడ్డా కుంగి పోలేదు. తన రాజకీయ అనుభవం అంత వయస్సు లేని నేతలు కూడా బాబు ని వాడు వీడు అంటున్నా ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఆ అవమానాలన్నీ తన గెలుపుకు మెట్లుగా భావించి ఓపికతో ఓర్పుతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అసాధ్యం అనుకున్న జగన్ ఓటమిని పవన్ తో కలిసి సుసాధ్యం చేసుకుని మళ్ళీ ప్రజల నమ్మకాన్ని పొందారు.

తన భార్యకు అవమానం జరిగిన చోట మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అంటూ శపధం చేసిన బాబు దానిని నెరవేర్చుకోవడానికి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ అధికార పార్టీ తప్పిదాలనుఎప్పటికప్పుడు ప్రజలకు ఎత్తి చూపారు. దాని ఫలితంగా అరెస్టయ్యి జైలుకు కూడా వెళ్లినా ఎక్కడా తగ్గలేదు, తడబడలేదు. అలాగే తనను ఓడించారు అనే బాధలో ఎన్నడూ ప్రజలకు మొహం చాటెయ్యలేదు.

కేసీఆర్ కూడా ఓడిపోయాను, ఓడించారు అంటూ మీనమేషాలు లెక్కపెడుతూ కాలం వెళ్లబుచ్చితే పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం అసాధ్యమే అవుతుంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించడానికి బీజేపీ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దీనితో బిఆర్ఎస్ నే నమ్ముకున్న కార్యకర్తలు, నేతలు మా అధినేత మిస్సింగ్ అంటూ ఢీలా పడిపోతున్నారు. కేసీఆర్ తానూ ముందుకొచ్చి పార్టీని సంక్షోభం నుండి బయటపడేయాల్సిన సమయం ఆసన్నమయింది.

ADVERTISEMENT
Latest Stories