శాసనసభ, లోక్సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో బిఆర్ఎస్ పార్టీ చాలా వేగంగా ఖాళీ అయిపోతోంది. ఇప్పటి వరకు 8 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
బడ్జెట్ సమావేశాలలోగానే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని, చివరికి బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగిలిపోతారని కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోతేనే బిఆర్ఎస్ పార్టీ ఇంత వేగంగా ఎందుకు ఖాళీ అయిపోతోంది? అని ప్రశ్నించుకుంటే అనేక సమాధానాలు కనిపిస్తున్నాయి.
1. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ కేసీఆర్ చెప్పే కాకమ్మ కధలను ఎమ్మెల్యే నమ్మకపోవడం.
2. కూతురు కల్వకుంట్ల కవితనే జైలు నుంచి విడిపించుకోలేకపోతున్న కేసీఆర్, ఎమ్మెల్యేలు కేసులలో చిక్కుకుంటే తమను కాపాడగలరనే నమ్మకం కోల్పోవడం.
3. కూతురు కవిత కోసమే లోక్సభ ఎన్నికలలో పార్టీని బలిచేశారనే భావన.
4. లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోవడంతో కేసీఆర్ నాయకత్వంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుడ్డి నమ్మకం పటాపంచలు కావడం.
5. ఇంతకాలం మోడీపై కత్తులు దూసిన కేసీఆర్ మళ్ళీ అదే బీజేపీతో తెర వెనుక మంతనాలు సాగిస్తుండటం.
6. కేసీఆర్ ప్రజల మద్యకు వెళ్లకుండా ఫామ్హౌస్లో కూర్చొని రాజకీయాలు చేస్తుండటం వలన ప్రయోజనం ఉండదని భావించడం.
7. ప్రజలు ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారం చేజిక్కించుకోవాలని కేసీఆర్ పగటి కలలు కంటుండటం.
8. మరో నాలుగున్నరేళ్ళవరకు ఎన్నికలు జరుగవు. కనుక అంతకాలం కేసీఆర్ని నమ్ముకొని వెంటనడుస్తూ జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకనే ఆలోచన.
9. అధికార పార్టీలో ఉంటేనే ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తుండటం.
ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా చాలా కారణాలే కనిపిస్తాయి. కారణాలు ఏవైనప్పటికీ బిఆర్ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారనేది వాస్తవం.
కనుక ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని చంద్రబాబు నాయుడులాగ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై తమ ప్రభుత్వంతో పోరాడితే మంచిదని సిఎం రేవంత్ రెడ్డి సలహా ఇవ్వడం వీటన్నిటికీ కొసమెరుపు అనుకోవచ్చు.




