బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరు రాష్ట్రాల మద్య నీటి వివాదాల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహాయ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, అధికారులు తమ వాదనలు చాలా బలంగా వినిపించి 13 ప్రతిపాదనలు చేశారు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కమిటీ ఏర్పాటుకి ఇరు వర్గాలు అంగీకరించాయి.
ముందే చెప్పుకున్నట్లు, బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తుంది కనుక ఈ సమావేశంపై అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ పెడితే సమావేశం బాయ్కాట్ చేసి వచ్చేస్తామని ప్రగల్భాలు పలికిన సిఎం రేవంత్ రెడ్డి, సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగితే బుద్దిగా విని, కమిటీ ఏర్పాటుకి అంగీకరీంచి సంతకం పెట్టి వచ్చేశారని ఆరోపించారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తలూపుతూ కృష్ణా, గోదావరి నీళ్ళని ఏపీకి అప్పజెప్పి వచ్చారని హరీష్ రావు విమర్శించారు.
కల్వకుంట్ల కవిత మరో అడుగు ముందుకువేసి “బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసమే తప్ప ఏపీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. కనుక తక్షణం ఈ ప్రాజెక్టుని విరమించుకోవాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వినకపోతే మేము న్యాయ పోరాటం చేస్తాము. మా ముఖ్యమంత్రి చాతకానితనం వలన మా రాష్ట్రానికి నష్టం కలుగుతుంటే మాకు బాధ కలుగుతోంది. అందువల్లే మేము మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు పోరాడవలసి వస్తోంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ రాజకీయాలలో పైచేయి సాధించడానికి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో ఏవిదంగా రాజకీయాలు చేస్తుందో అర్దం చేసుకోవడానికి ఈ మాటలే చక్కటి ఉదాహరణ.
దిగువన ఉన్న ఏపీలోకి ప్రవహించిన నీటి గురించి ఇంతగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడరు. ఎందుకంటే వాటితో తెలంగాణ సెంటిమెంట్ పండదు. చంద్రబాబు నాయుడుని చూపించి మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్ పండుతుంది.
కనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలనే లేబిల్ తగిలించి నీళ్ళ రాజకీయాలు చేస్తూనే ఉంటారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు గడిచినా ఇంకా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుండటం సిగ్గుచేటనుకోవడం లేదు.
టిఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నా ఆ పార్టీ నేతలు వేర్పాటువాదుల్లాగే వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరిలోనూ జాతీయస్పూర్తి కనిపించదు.
తెలంగాణలో భూ స్థాపితం చేశామనుకున్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించడానికి నేటికీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకోవాలసి వస్తున్నందుకు సిగ్గుపడటం లేదు.




