ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య వివాదాలను నిశితంగా గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న పేచీలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎపీకి ఎగువనున్న తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సహజం.
దానినీ హరీష్ రావు వంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ మాటకారితనంతో తప్పుగా అభివర్ణిస్తున్నారు. అదే హరీష్ రావు తెలంగాణకు దిగువనున్న ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తప్పుగా భావించడం లేదు. పైగా ‘మా బతుకు తెరువు కోసం పోరాటం’ అంటూ గట్టిగా తెలివిగా సమర్ధించుకుంటున్నారు కూడా.
బీఆర్ఎస్ పార్టీకి నిత్యం ఎవరో ఒకరితో పేచీలు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఆ పేచీలు ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాలుగా కవరింగ్ ఇచ్చుకుంటోంది. కానీ ఈ వైఖరి వలననే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని చెప్పక తప్పదు.
కేంద్రంతో కేసీఆర్ పేచీల వలన తెలంగాణ రాష్ట్రం ఎంతగానో నష్టపోతుంటే దానిని ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’ అంటూ అభివర్ణిస్తూ తమ తప్పుని కేంద్రంపైకి నెట్టేసేవారు. కేంద్రంపై కత్తులు దూసిన కేసీఆరే, తన కూతురు కోసం పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడ్డారు కదా?
అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లే కదా?
ఏపీలో జగన్, చంద్రబాబు నాయుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలంగాణతో పేచీలకు ఇష్టపడలేదు. నేటికీ చంద్రబాబు నాయుడు స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు కూడా.
కానీ బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ ప్రయోజనాల’ పేరుతో తమ రాజకీయ అవసరాలు, పార్టీ ప్రయోజనాల కోసం ఏపీతో పేచీలు పెట్టుకోవడమే కాక, తమ ఉచ్చులోకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా లాగుతోంది. తమలాగ కాంగ్రెస్ మంత్రులు చంద్రబాబు నాయుడుతో గొడవ పడకపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని తీర్మానించేసింది.
బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో చేస్తున్న ఈ రాజకీయాల వలన తెలంగాణలో ఆ పార్టీ ప్రజలను ఆకర్షించగలిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నష్టపోవలసి వస్తుంది. కనుక కాంగ్రెస్ మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీ పాటకు తాళం వేయక తప్పడం లేదు.
దీని వలన ఏపీ, తెలంగాణల మద్య ఎప్పటికీ శత్రుత్వం కొనసాగించక తప్పదన్నట్లయ్యింది. శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బనకచర్ల ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పార్టీ వేసిన ఉచ్చులో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.






