బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత తిరుగుబాటు చేసి తెలంగాణని మళ్ళీ జాగృతం చేస్తుంటే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డల్లాస్లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళారు. కల్వకుంట్ల కవిత చేస్తున్న హడావుడితో బిఆర్ఎస్ పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం పొంచి ఉంటే కేటీఆర్ అమెరికాలో, కేసీఆర్ ఫామ్హౌస్లో చిల్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒకవేళ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ మొదలవకపోయి ఉంటే, డల్లాస్ సభలో కేటీఆర్ పాల్గొన్నా అందరూ హర్షించేవారు. కానీ ఇటువంటి సమయంలో ఆయన ఆ సభలో పాల్గొంటున్నారు కనుక తప్పకుండా కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న ఈ లుకలుకల గురించి ఎవరో ఒకరు ప్రశ్నించవచ్చు. అప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాల్సి రావచ్చు. తద్వారా కల్వకుంట్ల యుద్ధాలు తెలంగాణ సరిహద్దులు దాటేసి అమెరికా వరకు చేర్చినట్లవుతుంది కదా?
ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్ధానాలు చేయడమే అని నేటికీ కేటీఆర్ వాదిస్తుంటారు. కానీ నిజామాబాద్ లోక్సభ ఎన్నికలలో తన ఓటమికి ని పార్టీలో నేతలే కారణమని, ఈ విషయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించలేదని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు కదా?
కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించనని కల్వకుంట్ల కవిత కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు కదా? మరి ఇంట్లో ఇంత ఈగల మోత ఉంటే, కేటీఆర్ డల్లాస్ వెళ్ళి బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలలో ఏం మాట్లాడుతారు? తమ కుటుంబంలో కీచులాటల గురించి ఏమని చెప్పుకోగలరు?




