
అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాన్ని ‘రక్తచరిత్ర’ సినిమాలుగా మలిచి రాంగోపాల్ వర్మ ఎంత సంచలనం సృష్టించారో, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సి.కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో పాపులర్ అయ్యారు. తాజాగా ఈ సినిమాల గురించి కొన్ని ‘పచ్చి నిజాలు’ బయటపెట్టారు కళ్యాణ్. ‘రక్తచరిత్ర’ పార్ట్ 1, 2 లలో మీరు చూపించింది అంతా నిజమేనా? జరిగిన వాస్తవాలే మీరు తెరకెక్కించారా? అని మీడియా ప్రతినిధి వేసిన సూటి ప్రశ్నకు సి.కళ్యాణ్ కూడా అంతే సూటిగా సమాధానం ఇవ్వడం విశేషం.
‘రక్తచరిత్ర పార్ట్ 2’ సినిమా విషయంలో ఒత్తిడిలు ఎదురైన మాట నూటికి నూరు శాతం నిజమేనని, అయితే అది పరిటాల రవి కుటుంబం గురించి కాదు.., మద్దెలచెరువు సూరి కుటుంబం నుండి కాదు.., ఎవరికీ తెలియని మూడో కోణం ఉంది… ఆ మూడో కోణం వలన ‘రక్తచరిత్ర 2’ గందరగోళానికి గురయ్యిందని, దాని వలన నిర్మాతగా తానూ నష్టపోయానని సి.కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఆ ‘మూడో కోణం’ ఎవరన్న దానిపై సదరు మీడియా ప్రతినిధి మళ్ళీ అడగడంతో కళ్యాణ్ బయటపెట్టక తప్పలేదు.
‘రక్తచరిత్ర 2’లో వైఎస్సార్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తీసివేయడం జరిగిందని, హీరో సూర్య గారు డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన సమయంలో… ఆ సినిమాను జగన్ కజిన్స్ చూడడం జరిగిందని… ఆ తర్వాత రాజకీయంగా తమపై ఒత్తిడి వచ్చిందని… తానూ వైఎస్సార్ అభిమాని కావడంతో, దాన్ని అలా ఎడిట్ చేసామని, అయితే సినిమాగా చూస్తున్నపుడు అలాంటివన్నీ చూడకూడదు, జరిగిందే కదా మేం చూపించేది… అంటూ “మూడో కోణం” విషయాన్ని బయటపెట్టారు కళ్యాణ్.
‘రక్తచరిత్ర’ పార్ట్ 1 సక్సెస్ అయినంతగా పార్ట్ 2 ప్రేక్షకులను అలరించకపోవడానికి కారణం కూడా ఇదే. జరిగిన వాస్తవానికి దూరంగా సినిమాలో చూపించడంతో అందరికీ తెలిసిన విషయం సినిమాలో లేకపోయేపాటికి, రక్తచరిత్ర 2 పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా సి.కళ్యాణ్ నష్టపోవడానికి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ కారణం కాదని, ఆ ‘మూడో శక్తి’ అని తాజాగా నిగ్గుతేలింది.



