చనిపోయిన వైఎస్ కాంగ్రెస్‌ను బ్రతికించగలరా?

ysr-ys-sharmila

దేశాన్ని, రాష్ట్రాలని చాలా మంది పాలిస్తున్నప్పటికీ వారిలో కొందరికి మాత్రమే ‘బ్రాండ్ ఇమేజ్‌’ ఏర్పడుతుంది. వారి పేరుతోనే రాజకీయాలు సాగుతుంటాయి. ఉదాహరణకు బీజేపీకి ఒకప్పుడు అద్వానీ, వాజ్‌పేయి, టిడిపికి ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌కు ఇందిరా, సోనియా, రాహుల్, బిఆర్ఎస్‌కు కేసీఆర్‌, వైసీపికి వైఎస్సార్ తదితరులున్నారు.

రాజకీయాలలో ఇది సర్వసాధారణమైన విషయమే. కానీ ఏపీలో పదేళ్ళ క్రితం తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీని అంతకంటే ముందే చనిపోయిన వైఎస్ బ్రతికించగలరా? అంటే అవుననే అనుకుంటున్నారు వైఎస్ షర్మిల.

ADVERTISEMENT

అందుకే జూలై 8న విజయవాడలో ఆయన 75వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఇంకా పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులను ఆమె ఆహ్వానిస్తున్నారు.

అయితే తెలంగాణలో ‘తెలంగాణ సెంటిమెంట్’ చాలా బలంగా ఉందనే సంగతి గ్రహించకుండా ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానంటూ దాదాపు మూడేళ్ళపాటు కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసినా వైఎస్ షర్మిలకు ఫలితం దక్కలేదు. ఆమె ఇప్పుడు ఏపీలో కూడా అదే తప్పు చేస్తున్నారా?అంటే అవుననే అనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే విషయం పట్టించుకోకుండా తన అన్నలాగే తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తే రాణించగలనని అనుకుంటున్నట్లున్నారు.

అయితే వైఎస్ పేరుని జగన్‌ పూర్తిగా వాడేసుకుని ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ తండ్రి స్థాయిని చేరుకోలేకపోగా 5 ఏళ్ళ అరాచక పాలనతో తండ్రి పేరు కూడా చెడగొట్టారు.

కనుక ఏపీలో ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి? రాజకీయ పార్టీల నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు?అసలు ప్రజలు తమ నుంచి ఏమి కోరుకుంటున్నారు?అనే విషయాలు పట్టించుకోకుండా వైఎస్ షర్మిల తన తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలరా?వైఎస్ పేరు చెప్పుకుని ఏపీ కాంగ్రెస్‌ను బ్రతికించుకోగలరా?లేదా వైఎస్ ఆమెను, ఏపీ కాంగ్రెస్ పార్టీని కాపాడగలరా?అంటే కాదనే చెప్పవచ్చు.

నిజానికి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్‌ రెడ్డి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చివరి వరకు గ్రహించనే లేదు. అందుకే ప్రజలు ఆయనను గద్దె దించేశారు. దిగిపోయినా ఇంకా తెలుసుకోలేకపోతున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ గ్రహించారు కనుకనే వారికి అధికారం అప్పగించారు. అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన అమరావతి, పోలవరంపై దృష్టి పెట్టారు కూడా. కనుక వైఎస్ షర్మిల కూడా ఏపీ రాజకీయాలలో రాణించాలనుకుంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగాలే తప్ప తండ్రి పేరు చెప్పుకొని ఎంత తిరిగినా ఏ ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories