పొదుపు సూత్రాలు ‘ఉచితాలకు’ కూడా అమలు చేయాల్సిందేనా.?

Narendra Modi Savings Formula

ప్రపంచం సంక్షోభం దిశగా అడుగులు వేయబోతుంది, ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న ఈ సంక్షోభ పరిస్థితులు ఇలానే కొనసాగితే చాలామంది పేదరికంలో కూరుకుపోయే అవకాశం ఉంది, ఈ దశాబ్దంలో ఇప్పటికే కరోనా వంటి భయంకర మహమ్మారిని చూసాం, ఇక యుద్దాలు చూస్తున్నాం, వాటి ఫలితంగా ఎదురవుతున్న ఇంధన సంక్షోభాన్ని అనుభవిస్తున్నాం అంటూ విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక జారీచేశారు.

ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్ లోను ఇలానే కొనసాగితే ఇప్పటి వరకు సాధించిన విజయలన్ని నిరుపయోగాలుగా మారే ప్రమాదం ఉందని, అందుకే దేశంలో ‘పొదుపు సూత్రాలను’ అమలు చేస్తున్నాం అంటూ వివరించారు నరేంద్ర మోదీ. అయితే మోదీ చెపుతున్నట్టు, హెచ్చరిస్తున్నట్టో భవిష్యత్ మరింత సంక్షోభం దిశగా వెళ్తే మోదీ అమలు చేస్తున్న ఈ పొదుపు సూత్రాలు సరిపోతాయా.?

ADVERTISEMENT

ప్రజలను ఇంధన ఖర్చు తగ్గించండి, బంగారం కొనుగోళ్లు మానుకోండి, విదేశీ పర్యటనలను వాయిదా వేయండి, పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వినియోగాన్ని పెంచండి, ఈవీ వాహనాల వైపు మళ్ళండి…అంటూ మోదీ చేసిన సూచనలు దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టగలవా.?

దేశం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని చెపుతున్న రాజకీయ నేతలు, దేశ – రాష్ట్రాధిపతులు తమ పాలనలో ఉన్న ఉచితాల సంఖ్యను కుదించగలరా.? కేవలం తమ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఒకరిని మించి మరొకరు ప్రజలకు ఉచితాలను ఎరగా వేసి అధికారంలోకి వస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర బడ్జెట్ లో సింహ భాగం ఈ ఉచితాల పంపిణి కోసమే వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సహా ఆర్థిక నిపుణులు కూడా మేనిఫెస్టో రూపంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల పై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నా, ఉచితాలు హద్దులు దాటుతున్నాయని హెచ్చరిస్తున్నా పార్టీల నాయకులు మాత్రం ఒక వర్గం ఓట్ల కోసం ఈ ఉచితాలను కుదించేందుకు సాహసించడం లేదు.

దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి ఒక రకంగా ఈ ఉచితాల పంపిణి కూడా కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. రాజకీయ పార్టీల నేతలు తమ పార్టీ అధికార పీఠం కోసం, ముఖ్యమంత్రి పదవుల కోసం ఉచిత బంగారాలు, ఉచిత వాహనాలు, ఉచిత కంప్యూటర్లు, ఉచిత రవాణా సదుపాయాలు, ఉచిత నగదు పంపిణీ అంటూ ముందుకెళ్తుంటే అది ప్రపంచం ఎదుర్కుంటున్న సంక్షోభాలను దాటి దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడగలదా.?

ప్రజలకే కాదు ఈ పొదుపు సూత్రాలు రాజకీయ పార్టీలు కూడా అమలు చెయ్యాల్సి ఉంటుంది. ఉచితాల హామీల విషయంలో కూడా రాజకీయ పార్టీలు పొదుపు సూత్రాలను పాటించాలని, రాష్ట్ర బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుని అప్పులు చేయని సంక్షేమాన్ని మాత్రమే ప్రభుత్వాలు అమలుచేసే విధంగా మేనిఫెస్టోలు రూపొందించడం కూడా ఒక రకంగా దేశ సేవే అవుతుందని రాజకీయ పార్టీల అధినేతలు గ్రహించాలి.

వారి పార్టీల రాజకీయ లబ్ది కోసం రూపొందించుకుంటున్న మానిఫెస్టోల భారం సామాన్యుడి నడ్డి విరుస్తుంది. అటు ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు పొందలేక ఇటు ఆ పథకాల అమలు కోసం ప్రభుత్వాలు పెంచే ఆర్థిక భారాన్ని మోయలేక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆర్థికంగా నలిగిపోతుంది. ఆ వర్గం ఆర్థిక వెనుకబాటు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చెయ్యగలదు.

కాబట్టి పొదుపు సూత్రాలను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో ఉచితాల విషయంలో కూడా కాస్త పొదుపుగా ఆలోచిస్తూ ముందుకు వెళితే అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories