హిందూ సంప్రదాయంలో దేవతా విగ్రహాలు పూజిస్తారు. అయితే ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవడం అందరికీ కుదరదు. ఒకవేళ ఉన్నా విగ్రహం పెట్టి పూజలు చేయాలనుకుంటే అందుకు కొన్ని కటినమైన పద్దతులు ఉన్నాయి.
కనుక చాలా మంది ఇళ్ళలో దేవీదేవతల ఫోటోలు పెట్టి పూజలు చేస్తుంటారు. అంటే ఇది పూర్తిగా ఈశ్వరారాధన… ఆధ్యాత్మికతకు సంబంధించినదన్న మాట.
కనుక పూజ గదిలో లేదా దేవతల ఫోటోలు పక్కన మరణించిన పెద్దల ఫోటోలు పెట్టొచ్చా పెట్టకూడదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆ సందేహం లేనివారు పెద్దల ఫోటోలు దేవుడి గదిలో లేదా దేవుని ఫోటోల పక్కన పెట్టి పూజిస్తుంటారు. కానీ అలా పెట్టొచ్చా అంటే పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
“దేవతల ఫోటోలు పక్కన చనిపోయిన పెద్దల ఫోటోలు పెట్టడం వారిని గౌరవించడం గానే చూడాలి. ప్రతీరోజూ దేవతారాధనతో పాటు పెద్దలను కూడా స్మరించుకోవడం చాలా మంచి అలవాటే. ముఖ్యంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది.
కనుక చనిపోయిన పెద్దలు దేవుడితో సమానం. కనుక దేవుడి ఫోటోల పక్కన చనిపోయిన పెద్దల ఫోటోలు పెట్టుకోవచ్చు. పూజించవచ్చు. అది తప్పు కాదు,” అని కొందరు పండితులు చెపుతారు.
కానీ మరికొందరు పండితులు ఏం చేపుతారంటే, “ఆ దేవుడే ఈ సకల చరాచర సృష్టి, లయ స్థితికి మూలకారకుడు. కనుక ఆయనని మనం భక్తితో పూజిస్తాము. ఆ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావానికి, చనిపోయిన పెద్దల పట్ల మనకున్న గౌరవభావానికి చాలా తేడా ఉంది.
చనిపోయినవారు ఆ భగవంతుని సృష్టిలో చిన్న రేణువు మాత్రమే. కేవలం మానవ మాత్రులే తప్ప దేవుళ్ళు కారు. కనుక చనిపోయిన పెద్దలు మనకు ఎంత పూజ్యనీయులైనప్పటికీ వారి ఫోటోలు దేవుడి గదిలో లేదా దేవుడి ఫోటోల పక్కన పెట్టకూడదు.
కనుక వారి ఫోటోలు వేరే అనువైన చోట పెట్టుకుని వారిని గౌరవించడం, స్మరించడం మంచిది. భక్తి, గౌరవం రెండూ భిన్నమైన భావజాలాలు. వాటిని మిళితం చేయకుండా ఉంటేనే రెంటిలో సంపూర్ణత లభిస్తుంది,” అని చెపుతారు.
మొదటి వివరణ కంటే రెండోవది తర్కబద్దంగా సహేతుకంగా అనిపిస్తోంది. కానీ ఇది అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అలాగే దీనిపై నిర్దిష్టమైన నియమం అంటూ లేదు కనుక ఎవరికీ నచ్చిన పద్దతి వారు పాటించవచ్చు.







