వైసీపీ నేతలకి సిబిఐకి ఏదో జన్మజన్మల సంబందం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పార్టీలో నంబర్-2గా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డిపై సిబిఐ కోర్టులో అక్రమాస్తుల కేసుల విచారణ జరుగుతుండగా, సిఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు జరుపుతోంది.
తాజాగా ప్రకాశం జిల్లా చీరాల సీనియర్ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సిబిఐ అధికారులు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీల తీరు, వారి తీర్పులపై ఇదివరకు బహిరంగంగా విమర్శించినందుకు సిబిఐ అధికారులు ఆయనను విశాఖలో తమ కార్యాలయంలో విచారించారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి విచారణకు హాజరుకావాలని సిబిఐ అధికారులు ఆమంచి కృష్ణ మోహన్కు నోటీసు జారీ చేశారు. రేపు బుదవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావలని నోటీసు ద్వారా ఆదేశించారు.
గతంలో సిబిఐ అధికారులు విచారణకు నోటీసు జారీ చేసినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ కించపరచలేదు. అయినప్పటికీ విచారణకు హాజరయ్యి సిబిఐ అధికారులకు సహకరిస్తాను,” అని చెప్పారు. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి సిబిఐ అధికారులు నోటీసు జారీ చేయడం, మళ్ళీ ప్రశ్నించాలనుకోవడం గమనిస్తే ఈ కేసు ఆయన మెడకు పాములా చుట్టుకొనే సూచన కనిపిస్తోంది.



