55 ఏళ్ళ అతిలోకసుందరి “కాలం” చేసిందన్న చేదు నిజానికి సాక్ష్యంగా 2018 ఫిబ్రవరి 25వ తేదీ నిలిచిపోనుంది. నమ్మలేని నిజాలలో ఒకటిగా మిగిలిపోయే శ్రీదేవి మరణం ఇండియన్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ ముగ్ధ మనోహరురాలి చివరి శ్వాసను అందుకున్న నగరంగా దుబాయ్ చరిత్రలో మిగిలిపోనుంది. ఈ ఊహించని పరిణామం ప్రతి ఒక్కరిని షాకింగ్ కు గురి చేసింది. దీంతో శ్రీదేవి మరణంపై స్పందిస్తున్న సెలబ్రిటీలు గానీ, సామాన్య అభిమాన గణం గానీ ‘తాము షాక్ కు గురయ్యాము’ అన్న ఒకే ఒక్క మాటను వ్యక్తపరుస్తున్నారు.
నిజమే… కరెంటు లేకుండానే షాక్ తగిలినంత అనుభూతులను ఈ ‘వేటగాడు’ హీరోయిన్ మిగిల్చి వెళ్ళింది. ‘ఈ రోజు ద్వేషించినంతగా దేవుడ్ని తాను మరే రోజు ద్వేషించలేదని’ తనదైన శైలిలో చెప్పిన వర్మది కాస్త పైత్యం అంటారేమో గానీ… నిజానికి అలా భావించే అభిమానుల సంఖ్యకు కొదవలేదు. ఎందుకంటే… నయనాలతో హావభావాలు పలికించి, వీక్షకులను సమ్మోహితులను చేయగల అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రీదేవిది ఎప్పుడూ అగ్ర స్థానమే. అందుకే దేశం మొత్తం ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు.
శ్రీదేవి ‘ఇక లేరు’ అన్నది ఎంత వాస్తవమో… ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు అన్నది కూడా అంతే వాస్తవం. శ్రీదేవి అకాల మరణానికి చింతిస్తూ… ఆమె కుటుంబానికి కొండంత అండగా ఆ భగవంతుడు ఉండాలని కోరుకుంటూ… ‘అతిలోకసుందరి’ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ… మీ మిర్చి9.కాం.



