తల్లి తండ్రులు తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని మనుమలని అందించాలని కోరుకుంటారు. కుదిరితే మునిమనుమలని కూడా చూసి వెళ్ళాలనుకుంటారు. కానీ ఈ తాతయ్య రాష్ట్రంలో అందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని, మనుమలు, మునిమనులను అందించాలని కోరుకుంటారు. ఎంత మంది పిల్లలని కంటే అంత మందికి డబ్బిస్తానని చెప్తుంటారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు.
నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. “భారత్ జనాభాలో యువత శాతం బాగా తగ్గిపోతోంది. ఇదేవిధంగా కొనసాగిస్తే భవిష్యత్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతుంది. కనుక మళ్ళీ జనభా పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
ఇకపై మూడో సంతానానికి ఏడాదికి రూ.30,000, నాలుగో సంతానానికి రూ.40,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ అవుతుందని చెప్పారు.
ఒకప్పుడు దేశ జనాభా శరవేగంగా పెరిగిపోతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు చాలని’ ప్రచారం చేసేవి. అయినా దేశ జనాభా శరవేగంగా పెరిగిపోతుందాంతో ‘ఒక్కరే ముద్దు… ఇద్దరు హద్దు’ అంటూ ప్రచారం చేశాయి.
వాటి ప్రభావమో, నానాటికీ పెరిగిపోతున్న స్కూల్, కాలేజీ ఫీజులు, వైద్యం ఖర్చులు భరించలేకనో దక్షిణాది రాష్ట్రాలలో చాలా మంది ఒక్కరితోనే సరిపెట్టేసుకుంటున్నారు. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా బాగా తగ్గింది.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఈవిధంగా ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ జనాభా పెంచేందుకు కృషి చేస్తున్నారు. కానీ ఉద్యోగ భద్రత తగ్గి నానాటికీ ఖర్చులు పెరిగిపోతుంటే ఎవరు మాత్రం ముగ్గురు నలుగురు పిల్లలు కనే సాహసం చేస్తారు?






