చంద్రబాబు నాయుడుకి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మాజీ సిఎం జగన్ చేయని ప్రయత్నం లేదు. అదే… ఆనాడు కుప్పంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయించి స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఉండి ఉంటే బహుశః అయన ప్రయత్నాలు ఫలించి ఉండేవేమో?
కానీ పరిశ్రమలు రప్పించడం, ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం పెద్ద తలనొప్పి వ్యవహారమనుకొని సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెడుతూ కుప్పం ప్రజలను మెప్పించాలనుకున్నారు. కానీ జగన్ ఒకటనుకుంటే మరొకటి జరిగింది. ఆయన 175 అనుకుంటే ప్రజలు 11తో సరిపెట్టేశారు.
నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ఎక్కడికక్కడ స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కుప్పం ప్రజలకు కూడా వారు మాట ఇచ్చారు.
ఆ ప్రకారమే సిఎం చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో ఒకేసారి ఏడు పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వీటన్నిటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 7,900 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 12,000 మందికి ఉపాధి లభించబోతోంది.
మొత్తం 2,203 కోట్ల పెట్టుబడితో కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమల వివరాలు:
1. తంబగానిపల్లె వద్ద 16.3 ఎకరాలలో రూ.586 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ప్రముఖ అల్యూమినియం కంపెనీ హిండాల్కో.
2. గుడుగుపల్లె మండలం పొగరుపల్లె వద్ద 73.63 ఎకరాలలో రూ. 525 కోట్ల పెట్టుబడితో ఏస్ ఇంటర్నేషనల్.
3. పొగరు పల్లె వద్ద 18.68 ఎకరాలలో రూ.233 కోట్ల పెట్టుబడితో శ్రీజ ఇండస్ట్రీస్.
4. పొగరు పల్లె వద్ద 18.68 ఎకరాలలో రూ.372.80 కోట్ల పెట్టుబడితో ఎస్వీఎఫ్ సోయా.
5. శాంతిపురం మండలం పోడూరు వద్ద 41.22 ఎకరాలలో రూ.260 కోట్లు పెట్టుబడితో మదర్ డెయిరీ (ఫుడ్ ప్రాసెసింగ్).
6. పల్లార్లపల్లె వద్ద 18.7 ఎకరాలలో రూ.27 కోట్ల పెట్టుబడితో ఆలీప్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్.
7. రామకుప్పం మండలం విజలాపురం వద్ద 25 ఎకరాలలో రూ. 200 కోట్ల పెట్టుబడితో ఈ-రాయిస్ (ఎలెక్ట్రిక్ వాహనాల పరికరాలు తయారు చేసే పరిశ్రమ).






