శంఖుస్థాపనలు, శిలాఫలకాలను ప్రజలు వ్యంగోక్తిగా వాడుతుంటారు. పాలకులు ప్రజలను మభ్యపెట్టేందుకు అటువంటి పనులు చేస్తుమ్డటమే అందుకు కారణం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దేనికైనా శంఖుస్థాపనలు, శిలాఫలకాలు వేశారంటే ఏదోరోజు వాటి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి.
అమరావతిని భ్రమరావతి, శ్మశానం, వేశ్యల రాజధాని అంటూ వైసీపీ అవహేళన చేసేది. కానీ వైసీపీ నేతల కళ్ళెదుటే అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
విశాఖని రాజధాని చేస్తే తప్ప ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కావని వైసీపీ నేతలు వితండవాదనలు చేసేవారు. కానీ రాజధాని చేయకుండానే అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్ పోర్టు వగైరా తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తున్నారు సిఎం చంద్రబాబు నాయుడు.
ఈరోజు అయన ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద ఈర్లపాడులో పర్యటించి ఎంఎస్ఎంఈ పార్కుకి ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచే వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఇవికాక రాష్ట్ర వ్యాప్తంగా 329 ఎకరాలలో కొత్తగా 15 పారిశ్రామిక పార్కులను సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయునపల్లిలో కొత్తగా చేనేత పార్కుకి నేడు వర్చువల్గా శంఖుస్థాపన చేశారు. ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 587 ఎకరాలలో 35 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పటికే రాష్ట్రంలో ఆక్వా, గ్రానైట్, చేనేత పరిశ్రమలు, రవాణా, పర్యాటక రంగాలలో అగ్రగామిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్వాకం వలన అవన్నీ దెబ్బ తిన్నాయి. కొత్తగా పరిశ్రమలు రాలేదు. మౌలిక వసతుల అభివృద్ధి కూడా నిలిచిపోయింది.
కనుక సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ అన్నీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సివస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం గూగుల్ వంటి అతి పెద్ద సంస్థలను ఏపీకి ఆకర్షించగలిగిందన్నారు.
ఇప్పుడు రాయితీలు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో వారి పెట్టుబడులకు భద్రత ఉంటుందని నమ్మకం కల్పించడం వల్లనే ఇప్పుడు ఏపీకి పెట్టుబడిదారులు తరలివస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదని, జగన్ ముఖ్యమంత్రి కాబోరని వారికి నమ్మకం కల్పించడంలో చంద్రబాబు నాయుడు సఫలం అయ్యారని చెపుతున్నట్లు భావించవచ్చు.
కానీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ మేము తప్పకుండా అధికారంలోకి వస్తామని జగన్ బల్లగుద్ది మరీ చెపుతున్నారు. కనుక ఈ పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి, అమరావతి, పోలవరం నిర్మాణపనులు అన్నీ పూర్తవ్వాలంటే ప్రజలు కూడా సిఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇవ్వాలి. కాదని ప్రయోగం చేస్తే అమరావతితో సహా అన్నీ మళ్ళీ మొదటికొస్తాయి.






