
గతంలో జగన్ ఢిల్లీ వెళితే కొత్తగా అప్పులు పుట్టేవి. కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ఏదో ఓ మేలు జరుగుతోంది.
ఆయన తొలి పర్యటనతోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కదలిక మొదలైంది. అమరావతి నిర్మాణ పనులకి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15,000 కోట్లు దీర్గకాలిక రుణం లభించబోతోంది. ఆయన తాజా పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఆరు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
రూ.25,000 కోట్లతో మొత్తం 12 పార్కులలో ఆరు ఆంధ్రప్రదేశ్కి, మిగిలిన ఆరు బిహార్, పంజాబ్ రాష్ట్రాలకు కేటాయించబోతున్నట్లు తాజా సమాచారం. టిడిపి స్వయంగా ఈవిషయం సోషల్ మీడియాలో వెల్లడించింది కూడా.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
ఇదివరకు తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇలాగే తపించారు. చేసుకున్నారు కూడా. కానీ అది చూస్తూ కూడా జగన్ ఆయన నుంచి ఎటువంటి పాఠం నేర్చుకోలేదు.
జగన్ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేయడమే కాక, ఆయన అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి ఎవరూ పూడ్చలేనంత నష్టం కలిగించారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ప్రతీదీ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి రావడమే కాకుండా అమరావతి, పోలవరంతో సహా జగన్ చేసిన ఈ విధ్వంసాన్ని సరిచేయక తప్పడం లేదు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
అయితే చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొనే నేర్పు ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల అదృష్టమనే చెప్పాలి. రాష్ట్రానికి 6 పారిశ్రామిక పార్కులు కేటాయింపజేసుకోవడమే ఇందుకు తాజాగా ఉదాహరణగా భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి నిర్మాణం ఒక్కటే కాదు. పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు రావాలి. వాటితో ఎలాగూ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. వాటి వల్లనే చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ప్రత్యక్ష నిదర్శనాలుగా మన కళ్లెదుటే ఉన్నాయి. కనుక పారిశ్రామిక పార్కుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
కేంద్ర ప్రభుత్వం సహకరించినందునే ప్రపంచ బ్యాంక్ అమరావతికి రూ.15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సిద్దమైంది. అదేవిదంగా కేంద్రం పూనుకుంటే ఈ పార్కులలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటవుతాయి. ఈ 12 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అయితే వాటి ద్వారా దేశానికి సుమారు 1.5 ట్రిలియన్ పెట్టుబడులు వస్తాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక.
కనుక రాబోయే 5 ఏళ్ళ పాటు రాజకీయ వాతావరణం ఇలాగే అనుకూలంగా ఉండి, అన్ని సవ్యంగా సాగితే రాజధాని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా సమూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు మళ్ళీ జగన్మాయలో పడకుండా ఉండాలి.