రెండు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసకరపాలన సాగుతోంది. దీనిని ఎదుర్కోవాలంటే ప్రతీ ఇంటికి ఒకరు చొప్పున ముందుకు రావాలి. నేను, టిడిపి నేతలు, కార్యకర్తలు అందరూ వైసీపీని ఎదుర్కొని పోరాడుతూనే ఉన్నాము. వీరి అరాచకపాలన ఏ స్థాయికి చేరుకొందంటే ఎవరు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్ చేయడం వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేడో రేపో వాళ్ళు నన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు. నాపై కూడా దాడికి ప్రయత్నించవచ్చు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను లోపల వేసేందుకు నాపై అనేక కేసులు పెట్టారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను ఎప్పుడూ నిప్పులాగే బ్రతికాను కనుక. నాపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి నన్నేమి చేయగలడు?” అని అన్నారు.
ఆయన ఊహించిన్నట్లే ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని అర్దమవుతూనే ఉంది. అయితే ప్రజలకు అటువంటి భావన కలగకూడదనే సిఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన్నట్లు భావించవచ్చు. అంటే ఈ అరెస్టుతో ఆయనకు ఏమీ సంబందం లేదని, స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని ప్రజలు అనుకోవాలన్న మాట!
అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి ‘శనివారం ముహూర్తం’ ఎందుకో అందరికీ తెలుసు. ఆదివారం కోర్టుకు సెలవు కనుక కనీసం రెండు రోజులైనా ఆయనను ఖైదీగా ఉంచాలనే దురాలోచనే కనబడుతోంది.
గత కొన్నిరోజులుగా మంత్రులందరూ పోటీలు పడుతూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐటి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పదని చెప్పడం కూడా దీని కొరకే అని అర్దమవుతోంది. తద్వారా ప్రజలకు ముందస్తు సంకేతాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఏదో ఓ రోజు అరెస్ట్ కావడం కావచ్చనే భావన కల్పించి, రాష్ట్రంలో అల్లర్లు, ఆందోళనలు చెలరేగకుండా ఉండేందుకే వారందరూ ఆ విదంగా మాట్లాడి ఉండవచ్చు.



