టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పటి నుంచి ఏసీబీ కోర్టు-హైకోర్టు-సుప్రీంకోర్టులలో న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా ఆయనకు ఉపశమనం లభించడం లేదు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కి కూడా హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఆయనను అరెస్ట్ చేసి ఈ ఉచ్చులో బిగించేందుకు ఏపీ సీఐడీ సిద్దంగా ఉంది.
అయితే అక్టోబర్ 4వరకు నారా లోకేశ్ని అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించడంతో అంతవరకు వేచి చూడవలసి వస్తోంది. కనుక నారా లోకేశ్ ఢిల్లీ నుంచి తిరిగివచ్చి యువగళం పాదయాత్రని ప్రారంభిస్తారా?ఒకవేళ వస్తే వేరే కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక అక్కడే ఉంటూ టిడిపికి కార్యాచరణ సిద్దం చేసుకొంటారా?అనేది త్వరలో తెలుస్తుంది.
అయితే చంద్రబాబు నాయుడు మూడు వారాలుగా జైల్లో ఉంటూ ఎన్ని న్యాయపోరాటాలు చేస్తున్నప్పటికీ ఉపశమనం లభించకపోవడం గమనిస్తే, కాస్త రాజకీయ అవగాహన ఉన్నవారికెవరికైనా అసలు కారణం అర్దమవుతుంది. అయితే ‘చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు’ అలాంటి విషయాలు మాట్లాడితే ఆరోగ్యానికి ప్రమాదం.
ఈ కేసుల తీరు చూస్తే నారా లోకేశ్తో సహా ఎవరు లోపలకు వెళితే వారందరికీ కూడా ఇదే వర్తించే అవకాశం ఉంది. ఇది వరకు టిడిపి నేతలు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలను ఏ1, ఏ2 అని ఎద్దేవా చేశారు కనుక చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నేతలందరినీ కూడా అదేవిదంగా బ్రాండింగ్ చేయకుండా వైసీపి ప్రభుత్వం విడిచిపెట్టదని అర్దమవుతూనే ఉంది. కనుక ఈ సమస్యలకు ఎక్కడ పరిష్కారం లభిస్తుందో అక్కడే ప్రయత్నించుకోవాలి. అదెక్కడో అందరికీ తెలుసు.



