మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్క విషయం స్పష్టమైంది. వరుస కేసులతో ఆయనతో సహా టిడిపి ముఖ్య నేతలందరినీ అరెస్టు చేసి, ఎన్నికల వరకు అందరినీ జైలులోనే ఉంచితే అవలీలగా విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
గత రెండేళ్ళుగా వారిపై అనేక అవినీతి కేసులపై దర్యాప్తు చేయిస్తూ ఇంతవరకు కాలక్షేపం చేసి, ఇప్పుడు అన్ని కేసులను ఒకేసారి కాకుండా, ఒక కేసు విచారణ ముగింపుకు వస్తున్నప్పుడు కొత్తగా మరొకటి నమోదు చేస్తుండటం గమనిస్తే వీలైనంత ఎక్కువ కాలం లేదా కనీసం ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరినీ జైల్లోనే ఉంచాలని భావిస్తున్నట్లుంది.
హైకోర్టు, ఏసీబీ కోర్టు విచారణకు ఏపీ సీఐడీ తరపున హాజరవుతున్న న్యాయవాదులు కూడా తమకు కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరుతుండటం గమనిస్తే, వైసీపి ప్రభుత్వం ఈ కేసులను ఎన్నికల వరకు సాగదీయాలనుకొంటోందని స్పష్టమవుతోంది.
జగన్, విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులను ఏవిదంగా ఏళ్ళ తరబడి సాగదీస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అదేవిదంగా ఈ కేసులను కూడా కనీసం ఎన్నికలు పూర్తయ్యే వరకు సాగదీయాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టులు, కేసులు, విచారణలు అంటే ఎలాగూ త్వరగా తెమిలేవీ కావనే విషయం వైసీపి కంటే ఎవరికి బాగా తెలుసు?కనుక ఇప్పుడు ఈ సమస్యల నుంచి ఏవిదంగా బయటపడాలని ఆలోచించుకోవలసింది టిడిపి నేతలే.
అయితే వైసీపి తన రాజకీయ కక్ష సాధింపులకు కేసుల ముసుగు వేసి సమర్ధించుకొంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు వైసీపిని సమర్ధిస్తారా లేదా?అనేదే ముఖ్యం. అప్పటికి చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలందరినీ జైల్లో పెట్టినా కూడా ప్రజలే తేలుస్తారు!



