ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిందన్న విషయం బహిరంగమే. అయితే ఆనాటి విషయం మళ్ళీ నేడు ఎందుకు హైలైట్ గా జాతీయ మీడియా భావించింది అంటే… దానికి తెరలేపింది తిరుపతిలో జరిగిన మహానాడు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో చివరి రోజున జాతీయ మీడియాతో ముచ్చటించిన సమయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తన గతం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
“1996లో యునైటెడ్ ఫ్రంట్ కు అధికారం దక్కడంలో మేం కీలక పాత్ర పోషించాం. ఈ క్రమంలో ప్రధాని పదవి చేపట్టాలంటూ పలువురు ప్రముఖ నేతలు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను విముఖత చూపా. అయితే జ్యోతిబసు తదితరులు మరోమారు నాకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నాడు నా కుమారుడు తొమ్మిదో లేక పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసులోనే ప్రధాని పదవి చేపట్టవద్దంటూ లోకేష్ నన్ను ఆపాడు. ప్రధాని పదవి తాత్కాలికమేనని లోకేష్ హెచ్చరించడంతో, చేతికి అందిన ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలేశా” అని మహానాడు వేదికగా చంద్రబాబు చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థ ప్రముఖంగా ప్రచురించడంతో మళ్ళీ ఈ అంశం హైలైట్ అయ్యింది.
ఈ సందర్భంగా మీడియా వర్గీయులతో మాట్లాడిన చంద్రబాబు వాళ్ళను నవ్వులతో ముంచెత్తారు. “తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అద్భుతంగా కవర్ చేశారు… ఒక పేపర్ తప్ప” అనడంతో మీడియా వర్గీయుల ముఖాల్లో చిరు దరహాసం తాండవించింది. ‘ఢిల్లీ నుంచి వచ్చారు.. హైదరాబాద్ నుంచి వచ్చారు… అమరావతి నుంచి వచ్చారు… స్థానిక మీడియా వచ్చింది… ఒక పేపర్ తప్ప… ఆ పేపర్ రూటే వేరు… మన రూటే వేరు’ అంటూ ‘సాక్షి’ పత్రికను పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నవ్వులు చిందించారు.



