చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!

chandrababu-naidu--warning

మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

ADVERTISEMENT

నగరంలోని సుజాతమ్మ కాలనీలో గల ఆయన నివాసం నిన్న రాత్రి సుమారు 9 గంటలకు కొందరు దుండుగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి ఫర్నీచర్, వస్తువులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బయట ఉన్న రెండు కార్లను కూడా ధ్వంసం చేశారు.

దాడి జరుగుతున్న సమయంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి, ఆయన కుమారుడు ఇంట్లో లేరు. ఆయన తల్లి శ్రీలక్ష్మమ్మ ఒక్కరే ఉన్నారు. దుండగులు ఆమెని బెదిరించి వదిలేశారు. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సింధు ప్రియ పోలీసులను వెంటబెట్టుకొని అక్కడికి వస్తున్నారని తెలిసి దుండగులు పారిపోయారు.

సోమవారం మద్యాహ్నం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి చాలా అనుచితంగా మాట్లాడారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అమాయకూడని, ఆమె గురించి తెలియక పెళ్ళి చేసుకున్నడంటూ వారిద్దరినీ ఉద్దేశించి చాలా అసభ్యంగా మాట్లాడారు.

కనుక వారే తన ఇంటిపై ఈ దాడి చేయించారని ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆరోపించారు. అంటే వారి గురించి తాను చాలా తప్పుగా మాట్లాడనని, అందుకు ఈ దాడి జరిగిందని ప్రసన్నకుమార్ రెడ్డి అంగీకరిస్తున్నట్లే కదా?

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఈవిదంగా ఎవరు దాడులు, విధ్వంసం చేసినా వైసీపీ వాదనలు నిజమని ధృవీకరిస్తున్నట్లవుతుంది. ఇది పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు తెస్తుంది. ఇటువంటివి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి.

అవినీతి, అక్రమాలు, ఆరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నా ప్రజలెవరూ తప్పు పట్టడం లేదు. ఎందుకంటే అది వాస్తవమని తెలుసు కనుక! కానీ ఇటువంటి భౌతిక దాడులను ఎవరూ హర్షించరు.

రాష్ట్రంలో అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ పదేపదే చెపుతున్నప్పుడు రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటే, వేలెత్తి విమర్శించడానికి వైసీపీ నేతలకు చక్కటి అవకాశం కల్పించినట్లవుతుంది కదా?

“జగన్‌ నన్ను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు కనుక తలుచుకుంటే నేను కూడా జగన్‌ని జైల్లో పెట్టించగలను. కానీ అలా చేస్తే ఆయనకు, నాకూ తేడా ఏముంటుంది? జగన్‌ అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి తప్ప ప్రతీకార చర్యలు ఉండవు,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

అయినా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్ళపై ఇటువంటి దాడులు జరుగుతుంటే ఆయన విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఎవరు దాడి చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు.

జగన్‌ హయంలోనే ఈ భౌతిక దాడుల సంస్కృతి మొదలైంది. దానికి చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్య నేతలందరూ బాధితులే. కనుక ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో తాను ముఖ్యమంత్రికాగానే ఇంతకు ఇంతా ప్రతీకారం తీర్చుకుంటామని జగన్‌ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు కూడా. అంటే ఈ దాడుల సంస్కృతి వలన నష్టపోయేది వైసీపీ, టీడీపీ నేతలేనన్న మాట!

ప్రజలు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మార్క్ పాలన కోరుకుంటున్నారు. కనుక వైసీపీని రాజకీయంగా ఎదుర్కొంటూ కట్టడి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి చూపితే ప్రజలు సంతోషిస్తారు. జగన్‌కు మరో అవకాశం ఇవ్వరు.

ADVERTISEMENT
Latest Stories