కడపలో నిన్నటితో ముగిసిన మహానాడు సభలో సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.
ఏపీ రాజకీయాలు వైకుంఠపాళీ ఆటలా ఇలా పడుతూ లేస్తూ సాగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఒక పార్టీ, ప్రభుత్వం, పాలకుడు ఏవిదంగా ఉండాలో.. ఏవిదంగా ఉండకూడదో… అర్దం చేసుకునేందుకు కేస్ స్టడీగా టీడీపీ, వైసీపీలు మీ ముందున్నాయి.
కనుక రెంటిలో రాష్ట్రానికి ఏది మంచి చేస్తోందో, ఏది నష్టపరుస్తోందో ప్రజలు బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని దోచుకొని, అరాచకాలు చేసిన ఆ భూతాన్ని మళ్ళీ పైకి లేవకుండా ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. వారికి ఆ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది,” అంటూ కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి చేపడుతున్న పనులు వివరించారు.
రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని, అటువంటి పరిస్థితులలో సమర్ధుడైన చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టగలరని ప్రజలు గట్టిగా నమ్మారు. కనుకనే ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చేసిన పనులు అందరికీ తెలుసు.
కానీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన 2019లో ఏపీలో మరో రాజకీయ ప్రయోగం జరిగింది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సుస్థిర ప్రభుత్వం, సుస్థిరమైన విధానాలు చాలా అవసరం. అలా ఉన్నందునే తెలంగాణ శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.
కానీ రాష్ట్ర విభజన తర్వాత చాలా కీలకమైన తొలి పదేళ్ళలోనే ప్రజలు రెండు రాజకీయ ప్రయోగాలు చేశారు. మొదటి ప్రయోగం ఫలించగా రెండోది వికటించింది. దాని వలన జరిగిన నష్టం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆ నష్టం, ఆ అరాచకం నేటికీ ఏపీని వెంటాడుతూనే ఉంది. “నేను తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఇంతకింతా ప్రతీకారం తీచుకుంటానని” జగన్ పదేపదే చెపుతున్నారు. కనుక ప్రజలు మళ్ళీ జగన్ చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆయన పాలన ఏవిదంగా సాగబోతోందో అర్దం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలున్నాయి. కనుక రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ముందుకు వస్తున్నారు.
కనుక ప్రజలు కూడా ఈ సుస్థిరతని, అభివృద్ధిని కొనసాగించేందుకు రాజకీయ ప్రయోగాలకు దూరంగా ఉండటం చాలా అవసరం.
కానీ మరోసారి ప్రయోగం చేస్తే, ప్రతీ 5 ఏళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు, విధానాలు సమూలంగా మారిపోతుంటాయనే ముద్ర పడిపోతుంది. అప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో ఎంత ఉందో, ప్రజల చేతిలో కూడా అంతే ఉందని గ్రహించాలి.




