ఒక్కో రైతుకు లక్షన్నర్ర రుణ విముక్తి చేయడం మామూలు విషయం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కూడా రుణాలు మాఫీ చేయలేదని, తాము లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్నామని కేసీఆర్ ను పరోక్షంగా ఎండగట్టే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.., ఒకప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
నేనొక్కడినే కష్టపడితే అభివృద్ధి సాధ్యం కాదు, అందరూ కలసి రావాలి. రైతు నేల తల్లినే నమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడ్డా మనకు అన్నాన్ని పెడతాడు… అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మరవబోం… అని రైతు శ్రేయస్సు పట్ల తమ చిత్తశుద్దిని చాటుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేవలం రెండు నెలల్లో విద్యుత్ సమస్యను అధిగమించామని, దేశంలో నదుల అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని గుర్తు చేసారు.
రాబోయే రోజుల్లో కృష్ణా, సోమశిల నదులను అనుసంధానం చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతుల కష్టాలన్నీ తీరుతాయని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భజలాలను కాపాడుకోవాలని సూచించారు. అయితే ఇవన్నీ సక్రమంగా నెరవేరాలంటే జగన్ ఎలాంటి అడ్డుపుల్లలు వేయకూడదన్న అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తపరిచారు.



